భోపాల్: భారీ వర్షాలకు ఒక మొసలి కాలనీలోకి వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. మధ్య ప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయ మయ్యాయి. అయితే నీట మునిగిన శివపురి పాత బస్టాండ్ సమీపంలోని కాలనీ వీధులోకి ఆదివారం ఒక మొసలి వచ్చింది. దీనిని చూసిన స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, మాధవ్ నేషనల్ పార్క్ సిబ్బందిని పోలీసులు రప్పించారు. సుమారు గంట సేపు ప్రయత్నించిన తర్వాత ఎనిమిది అడుగుల పొడవున్న ఆ మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు. సంఖ్యా సాగర్ సరస్సులో దానిని విడిచిపెట్టారు. భారీ వర్షాలకు వరద ప్రవాహం వల్ల సమీపంలోని కాలువ నుంచి ఆ మొసలి కాలనీలోకి ప్రవేశి ఉంటుందని అధికారులు భావించారు.
మరోవైపు నీట మునిగిన కాలనీ వీధిలోకి వచ్చిన భారీ మొసలిని స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో రికార్డు చేశారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. పలువురు సెటైర్లు వేశారు.
Crocodile in shivpuri m.p pic.twitter.com/D2kVvDmlAH
— Pankaj Arora (@Pankajtumhara) August 14, 2022