షాద్నగర్ : వ్యవసాయ రంగం అభివృద్ధితోనే ఇతర రంగాల అభివృద్ధి ఆదారపడి ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరగాలని, అప్పుడు వర్తక, వాణిజ్య రంగాలు ప్రగతి సాధిస్తాయని చెప్పారు. బుధవారం షాద్నగర్ మార్కెట్ యార్డులో ఆయన మాట్లాడుతూ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతులను వ్యవసాయ రంగంలో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ వానకాలంలో 60.84 లక్షల మంది రైతులకు రూ. 7వేల 360కోట్లకు పైగా నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధ్యానత ఇవ్వడంతో ఆ రంగంతో పాటు అనుబంధ రంగాలు లాభపడుతున్నాయని చెప్పారు. కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవి కావని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలికేలా ఉన్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. కేవలం సీఎం కేసీఆర్పై ఉన్న ఆక్రోశంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయే తప్పా, ఆ పార్టీల వలన ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. తెలంగాణ నినాదాన్ని భుజాన ఎత్తుకొని రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ను విమర్శించేది మీరా ? అని దుయ్యబట్టారు. ఆంధ్రా ప్రాంత నాయకులు తెలంగాణలో పార్టీ పెట్టి ఇక్కడి సీఎంను విమర్శిస్తే ఎవ్వరు ఊరుకోరని హెచ్చరించారు. స్థానికంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వం పని తీరును ప్రశ్నించలేక కేసీఆర్ను విమర్శిస్తున్నారని అన్నారు.
పాలమూరు ఎత్తిపోతల ద్వార సాగునీరు ఇద్దామంటే కాంగ్రెస్ నేతలు 88కేసులు వేశారన్నారు. ఎవరెన్నీ అటంకాలు సృష్టించిన పాలమూరు ఎత్తిపోతల ద్వారా షాద్నగర్ ప్రాంతానికి సాగునీరు అందితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. వనపర్తి ప్రాంతంలో సాగునీరు పెరుగడం ద్వారా వలసలు ఆగిపోవడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే షాద్నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సభ్యులను అభినందించారు. మార్కెట్ అభివృద్ధి, రైతుల శ్రేయస్సు కోసం పాలక సభ్యులు కృషి చేయాలని కోరారు.
అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్రెడ్డి, సురబీ వాణిదేవి, జడ్పీ చైర్మన్ తీగల అనీతారెడ్డిలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవతో నేడు తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. మార్కెట్ యార్డుల అభివృద్ధి, ప్రత్యేకంగా మహిళలకు 50శాతం రిజర్వేషన్లను కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు రైతుబీమా నిధుల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మాణ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, రైతులు, మార్కెట్, వ్యవసాయ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు
మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. కొందుర్గు వైస్ ఎంపీపీ రాజేష్పటేల్ ఆధ్వర్యంలో పులుసు మామిడి గ్రామానికి చెందిన శరీపాభేగం, ఆమె అనుచరులు సుమారు 80మంది కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ నాయకులను మంత్రి టీఆర్ఎస్ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.