ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-ది రైజ్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయంగా ఈ చిత్ర డైలాగులు, డ్యాన్సులు చాలా పాపులర్ అయ్యాయి కూడా. సినిమాలో బన్నీ.. ఎర్రచందనం స్మగ్లర్గా కనిపించాడు. పోలీసుల కళ్లు కప్పి చాకచక్యంగా ఎర్రచందనాన్ని బోర్డర్ దాటించే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగాయి. వాటిని చూసిన యాసిన్ ఇనాయతుల్లా అనే వ్యక్తికి ఈ ప్లాన్లు సూపర్గా నచ్చేశాయి.
అంతే తను కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలని డిసైడయ్యాడు. కర్ణాటక-ఆంధ్ర బోర్డర్ కూడా దాటేశాడు. అయితే మహారాష్ట్రలో పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. తనిఖీల్లో వాహనాన్ని సీజ్ చేశామని, మొత్తం 2.45 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
అసలు ఎలా చేశాడంటే..?
పుష్ప సినిమాలో బన్నీ.. ఒక పాల వ్యాన్లో కింది భాగంలో ఎర్రచందనం దుంగలు పెట్టి, పైభాగంలో పాలు పోసి పోలీసుల కళ్లుగప్పే సన్నివేశాలు తెలుసుకదా. ఈ ప్లాన్ ఇనాయతుల్లాకు బాగా నచ్చింది. అందుకే ఒక ట్రక్కు తీసుకొని దానిలో ఎర్రచందనం దుంగలు పెట్టాడు. వాటిపై కూరగాయలు, పండ్ల బాక్సులు పెట్టాడు. అలాగే వాహనంపై ‘కరోనా అత్యవసర ఉత్పత్తులు’ అనే స్టిక్కర్ తగిలించాడు. వీటితో మోసం చేసి కర్ణాటక బోర్డర్ దాటేశాడు. కానీ మహారాష్ట్ర పోలీసులకు దొరికిపోయాడు.