న్యూఢిల్లీ: అత్యవసర అవసరాల కోసమే క్రెడిట్ కార్డుల వాడకంపై లభించే రివార్డు పాయింట్లు నిజంగా ఓ అదనపు బెనిఫిట్ అవుతుంది. ఈ రివార్డు పాయింట్లు మనకు అవసరమైన వివిధ వస్తువులు, సేవల కొనుగోలుకు ఉపకరిస్తాయి.
అంతే కాదు.. అవసరాన్ని బట్టి ఆ పాయింట్లను నగదుగానూ మార్చుకోవచ్చు.
మన లావాదేవీలను బట్టి రివార్డు పాయింట్లు లభిస్తుంటాయి. అసలీ రివార్డు పాయింట్లెలా వస్తాయి? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి? సదరు రివార్డు పాయింట్లతో అదనపు బెనిఫిట్ లభించేలా వాడుకోవాలన్న అంశాలను మనం ఖచ్చితంగా తెలుసుకుని ఉండాల్సిందే.
అయితే, ప్రతిసారీ క్రెడిట్ కార్డు లావాదేవీలు జరిపినప్పుడూ రివార్డు పాయింట్లు వస్తాయని చెప్పలేం. అది మన లావాదేవీలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని కార్డుల్లో ప్రతి రూ.100 ఖర్చుకు, మరికొన్ని కార్డులపై రూ.150, రూ.200లకు రివార్డు పాయింట్లు వస్తాయి. సాధారణంగా, ఏ వార్షిక ఫీజు లేదా ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఇచ్చే కార్డుల కంటే ప్రీమియం కార్డుల్లోనే రివార్డు పాయింట్లతోనే అధిక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
అయితే, కొన్ని క్రెడిట్ కార్డు కంపెనీలు తమ యూజర్లకు బోనస్ రివార్డు పాయింట్లు అందిస్తుంటాయి. నిర్ణీత గడువులో నిర్దేశిత మొత్తం వాడుకుంటే అదనపు పాయింట్లు ఆఫర్ చేస్తాయి. ఉదాహరణకు ఒక సంవత్సరంలో రూ.ఐదు లక్షల విలువైన లావాదేవీలకు 10వేల పాయింట్లు లభిస్తాయని కొన్ని కంపెనీలు చెబుతాయి.
రూ.8 లక్షల మేరకు ఖర్చు దాటితే మరో ఐదు వేల పాయింట్లు అదనంగా ఇస్తామని ప్రకటిస్తుంటాయి. అలాగని పాయింట్ల కోసం ఖర్చు చేయొద్దు. మీ అవసరాలకు అనుగుణంగా ఒకేసారి పండుగల సీజన్లో షాపింగ్ చేయడంతో బోనస్ పాయింట్లను పొందేందుకు చాన్స్ ఉంటుంది.
క్రెడిట్ కార్డులన్నింటికీ రివార్డు పాయింట్లు రాకపోవచ్చు. కనుక కార్డు తీసుకునేప్పుడే అన్ని వివరాలు తెలుసుకోవాలి. కొన్ని కార్డుల్లో పాయింట్లకు బదులుగా క్యాష్బ్యాక్లు… కొన్నింటికి డిస్కౌంట్లు అందుతాయి. అయితే, దాదాపు అన్ని క్రెడిట్ కార్డులపైనా ఏదో రకమైన ప్రయోజనం పొందే వసతులు అందుబాటులో ఉన్నాయి.
ఇక మనకు లభించిన రివార్డు పాయింట్ల విలువను పరిగణనలోకి తీసుకుని రిడీమ్ చేసుకోవాలి. ఆయా రివార్డు పాయింట్ల విలువ కంపెనీ, మనం చేసే లావాదేవీలను బట్టి చేంజ్ అవుతుంది. ఒక వస్తువు కొంటే ఒక పాయింట్ విలువ 20 పైసలుగా ఉంటే.. మరో వస్తువుపై 30 పైసలు విలువ చేయొచ్చు.
అదే సమయంలో క్రెడిట్ కార్డు లావాదేవీల ద్వారా లభించే రివార్డు పాయింట్లకు నిర్ణీత గడువు ఉంటుంది. అది దాటాక వాటిని మనం వాడుకోలేం. అందుకే క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ను ఎప్పటికప్పుడు ద్రుష్టిలో పెట్టుకోవాలి. సాధారణంగా చాలా కంపెనీలు ఎక్స్పైరీ డేట్ను రెండు, మూడేండ్లు నిర్ణయిస్తాయి. అతి కొద్ది కంపెనీల్లో నిర్ణీత టైం ఉండదు. అటువంటి కార్డులపై వచ్చే రివార్డు పాయింట్లను మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.
అలాగే, రివార్డు పాయింట్లను వీలైనంత తొందరగా పాయింట్లను రీడీమ్ చేసుకోవాలని ఆలోచించొద్దు. వాటికి గల అన్ని రకాల ప్రత్యామ్నాయాలను నిశితంగా పరిశీలించి అధిక విలువ లభించే చోట మాత్రమే వాడుకోవాలి. కొన్ని కంపెనీలు పండగ సీజన్లలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఆ సమయంలో మన వద్ద ఉన్న పాయింట్లకు ఎక్కువ మొత్తంలో వస్తువులు కొనే అవకాశం ఉండొచ్చు.
ఆన్లైన్లో జరిపే లావాదేవీల్లో రీడీమ్ చేసుకుంటే సాధారణంగా పాయింట్ విలువ ఎక్కువ ఉంటుంది. మరికొన్ని కంపెనీలు క్రెడిట్ కార్డు బకాయిల్ని చెల్లించేందుకూ తమ యూజర్లు ఆ రివార్డు పాయింట్లను వాడుకునేందుకు అవకాశమిస్తాయి. కనుక అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రివార్డు పాయింట్లపై అధిక ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తే ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.