అమరావతి: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఐ నాయకులు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. రేపటి నుంచి వరుస నిరసనలకు పిలుపునిచ్చినట్లు సీపీఐ ఏపీ నాయకుడు రామకృష్ణ వెల్లడించారు. ఇంటి పన్ను, చెత్తపన్ను పెంచి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచి నడ్డి విరుస్తుందని ఆరోపించారు.
రాష్ట్రంలో విద్యుత్ కేటగిరిలను రద్దు చేసి 13 శ్లాబ్లను ఆరుకు కుదించారని విమర్శించారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీలు మోపడం అన్యాయమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏడాదిలో ఇచ్చే పథకాల డబ్బూ పెంచిన విద్యుత్ బిల్లులకే సరిపోదని నారా లోకేశ్ తెలిపారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచకపోయినా తప్పుడు ఆరోపణలు చేసిన జగన్ క్షమాపణలు చెప్పాలని, విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్పై మాటతప్పి మోటార్లకు మీటర్లు బిగించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ అశోక్బాబు మాట్లాడుతూ విద్యుత్ రంగానికి సంబంధించి అరాచక పాలన చేస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచింది. 30 యూనిట్ల వరకు యూనిట్కు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు యూనిట్కు 91 పైసలు పెంచారు. 76 నుంచి 125 యూనిట్ల వరకు యూనిట్కు రూ. 1.40 పైసలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ. 6 లు, 226 నుంచి 400 యూనిట్ల వరకు యూనిట్కు రూ. 8.75 పైసలు , 400 యూనిట్లకు పైగా ఉన్నవాటికి యూనిట్కు రూ. 9.75 పైసలు ప్రభుత్వం ఛార్జీలను పెంచింది.