అమరావతి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారాతో 27 మంది చనిపోతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామంలో వాస్తవాల వక్రీకరణకు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా సహజ మరణాలుగా ప్రకటించడం దుర్మార్గమని తెలిపారు.
సారా మరణాలకు కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని, మృతుల కుటుంబాలపై ఒత్తిడి తెచ్చిన అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాలని బాధితులపై ఒత్తిడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెంలో పర్యటించి బాధిత కుటుంబాలను ఓదార్చాలని జగన్కు సూచించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన కోరారు.