సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ) : కొందరు లాక్డౌన్ సమయంలో రోడ్లపై యథేచ్ఛగా చక్కర్లు కొడుతుంటే.. మరికొందరు మాస్కులు ధరించడం లేదు.. ఇంకొందరు భౌతికదూరాన్ని విస్మరిస్తున్నారు. ఇలా బాధ్యత మరిచి నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేసులు నమోదు చేయడమే కాదు..వాహనాలను సీజ్ చేస్తున్నారు. నగరంలో లాక్డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు లక్షకుపైగా ఉల్లంఘన కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా చైన్ లింక్ను బ్రేక్ చేయాలంటే.. రూల్స్ అతిక్రమించవద్దని.. నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు.
లాక్డౌన్ అమలవుతున్నప్పటికీ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతో పాటు అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్న వారికి మినాహాయింపు ఇచ్చారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆయా ఉద్యోగులు, కార్మికుల రాకపోకలతో రోడ్లు రద్దీగా మారుతున్నాయి. వారితో పాటు కొందరు సందెట్లో సడేమియాలా రోడ్లపై వస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీల్లో వారి భరతం పడుతున్నారు. నగర కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ మొదలు నుంచి ఇప్పటి వరకు లక్షకుపైగా కేసులు నమోదవ్వగా, ప్రతి రోజూ 7 వేల నుంచి 8వేల వరకు వాహనాలను సీజ్ చేస్తున్నారు. అదే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తులను తీసుకుంటున్న వారిపై కూడా కేసులు పెడుతున్నారు. కాగా, నగర సీపీ అంజనీకుమార్ నగరంలోని వివిధ చెక్పోస్టులను నిత్యం పరిశీలిస్తున్నారు. లాక్డౌన్ అమలు తీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నారు.
ఘట్కేసర్ రూరల్, మే 28: లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని రాచకొండ సీపీ మహేశ్భగవత్ కోరారు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపాల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును శుక్రవారం ఆయన పరిశీలించారు. లాక్డౌన్ సమయంలో వచ్చిన వాహనాలను స్వయంగా తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి శానిటైజర్లు, మాస్కులు, తినుబండారాలు అందజేశారు. ప్రజలు ఇండ్లలోనే ఉండి..జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే బయటకు రావాలని సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీపీ వెంట ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎన్. చంద్రబాబు, డీఐ జంగయ్య, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.