తిరుపతి : నోడల్ గోశాలల నిర్వాహకులు తమ పరిధిలోని రైతులు గో ఆధారిత వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సూచించారు . టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణ గోశాల ఆధ్వర్యంలో శ్వేతాలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణా ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నోడల్ గో శాలలు గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తుల తయారీ మీద దృష్టి పెట్టాలని చెప్పారు .
టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి గో సంరక్షణ , గోశాలల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు .గో ఆధారిత పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు . గోవుల పోషణ ఇబ్బందిగా ఉన్న గోశాలల్లోని గోవులను టీటీడీ గోశాలకు తరలించి , గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా అందించేలా కృషి చేయాలన్నారు .
నోడల్ గోశాలల నిర్వాహకులతో ప్రతి నెల నేరుగా గానీ వర్చువల్ గా కానీ సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కార మార్గాలు ఆలోచిస్తామని వీరబ్రహ్మం చెప్పారు . శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ కమిటీ సభ్యులు రామ్ సునీల్ రెడ్డి , గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, శ్వేతా డైరెక్టర్ ప్రశాంతి , పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ వెంకట నాయుడు పాల్గొన్నారు.