న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు చాలా వరకూ తగ్గుముఖం పట్టాయి. కానీ కొందరు నిపుణులు ఇప్పటికీ కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని, పండుగల సీజన్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు. దీనికితోడు తాజాగా మరో కొత్త కరోనా వేరియంట్ కూడా వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో దేశంలో కరోనా నిబంధనలు మరికొన్నిరోజులు పొడిగించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. దేశంలో కరోనా ఆంక్షలను నవంబరు 30 వరకూ పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటన చేసింది. కంటైన్మెంట్ జోన్లు, అలాగే 5 శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో ప్రజలు గుమిగూడే ఎటువంటి కార్యక్రమాలకు అనుమతులు లేవని కేంద్రం తన ఉత్తర్వుల్లో తెలిపింది.
అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్-19 నిర్వహణలోని ఐదు సూత్రాలు ‘టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేట్తోపాటు కరోనా సమయంలో సముచిత ప్రవర్తన’ అనే వాటిని కచ్చితంగా పాటించాలని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి మరింత వ్యాపించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది.
కాగా, ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కరోనా మహమ్మారి విజృంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. కానీ పండుగల సీజన్ రావడంతో వైద్యారోగ్య శాఖ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. చలికాలం, పండుగల సీజన్ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలను అలక్ష్యం చేయొద్దని సూచించిన సంగతి తెలిసిందే.