లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఎటవా జిల్లాలో కేంద్ర మంత్రుల పేరిట వ్యాక్సిన్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. తఖా తహసీల్ సరిధిలోని ఓ హెల్త్ కేర్ సెంటర్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు సర్టిఫికెట్లు జారీ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ సర్టిఫికెట్లలో అమిత్ షా వయసు 33 సంవత్సరాలుగా, నితిన్ గడ్కరీ వయసు 30, పీయూష్ గోయల్ వయసు 37, ఓం బిర్లా వయసు 26 ఏండ్లుగా నమోదు చేశారు. వీరంతా ఫస్ట్ డోసు డిసెంబర్ 12న వేయించుకున్నట్లు నమోదైంది. ఇక సెకండ్ డోస్ 2022, మార్చి నుంచి ఏప్రిల్ 3వ తేదీ లోపు వేయించుకోవాలని సూచించడం జరిగింది.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇంచార్జిని వివరణ కోరారు. డిసెంబర్ 12వ తేదీన తన ఐడీని హ్యాక్ చేశారని, దాన్ని గ్రహించి వెంటనే ఐడీ మూసేయాలని లేఖ కూడా రాశామని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే సైబర్ నేరగాళ్లు ఈ కుట్రకు పాల్పడ్డారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటనపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.