న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాలు వేసిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలా? వద్దా? అని నిర్ణయించేందుకు అవసరమైన డేటా అందుబాటులేదని నిపుణులు స్పష్టం చేశారు. సెప్టెంబర్, అక్టోబర్ మధ్య దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని హోంమంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో థర్డ్ వేవ్ విరుచుకుపడే అవకాశం ఉందని అంచనా వేసింది. టీకా పంపిణీని వేగవంతం చేయాలని సూచించింది. అయితే, స్థానికంగా లభించే శాస్త్రీయ ఆధారాలను పరిశీలించిన తర్వాత దీనిపై ఓ స్పష్టతకు రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దీనిపై పరిశోధలు జరుగుతున్నాయన్నారు.
‘స్థానికంగా రూపొందించిన శాస్త్రీయ ఆధారాలకు అనుగుణంగా భారత్ బూస్టర్ డోస్పై నిర్ణయం తీసుకుంటుంది. బూస్టర్ డోసు అవసరమా? ఒకవేళ ఇవ్వాల్సి వస్తే రెండు డోసుల తీసుకున్నాక ఎంత విరామం ఉండాలి? అనే విషయాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. దేశంలో కొవిడ్ సంక్రమణ ఎపిడెమియాలజీ ద్వారా బూస్టర్ మోతాదుల అవసరాన్ని నిర్ణయిస్తారు. బూస్టర్ డోసుతో ప్రతికూల ప్రభావం కూడా లేకుండా చూసుకొవాలి’ అని ఎన్టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా పేర్కొన్నారు. గతంలో టీకాలు వేసిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రస్తుతం సూచించేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు.
‘డెల్టా వేరియంట్కు వ్యతిరేకంగా, టీకాలు వేసిన వారిలో తీవ్రమైన వ్యాధి, మరణాలు తగ్గించడంలో టీకాలు ప్రభావవంతంగా ఉన్నాయన్నారు. ‘దేశంలో టీకా ఒక్కడోసు కూడా తీసుకోని వారు ఇంకా చాలా మంది ఉన్నారు. వ్యాధి తీవ్రత, మరణాల రేటు తగ్గించాలంటే థర్డ్ వేవ్లో వైరస్ ముప్పు అధికంగా ఉన్న వాళ్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రస్తుతానికి బూస్టర్ డోసులు అవసరం లేదు. మరింత డేటా అందుబాటులోకి వచ్చాక బూస్టర్ డోసు ఎప్పుడు ఇవ్వాలి, ఎలాంటిది ఇవ్వాలి అనే దానిపై స్పష్టత వస్తుంది’ అన్నారు. ఇదిలా ఉండగా.. బూస్టర్ డోస్ ఇచ్చే విషయమై ఎన్ఈజీవీఏసీ చర్చించిందని, దీనిపై లోతైన పరిశీలన చేస్తున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ ఈ నెల ప్రారంభంలో తెలిపారు.