పోర్ట్ బ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లోని జరవ తదితర తెగలవారికి కోవిడ్ టీకాల కార్యక్రమం పెద్దఎత్తున చేపట్టారు. సున్నితమైన రోగనిరోధకత కలిగిన ఈ తెగలలో గతేడాది కన్నా ఎక్కువ కోవిడ్ కేసులు కనిపిస్తుండడంతో స్థానిక అధికారులు టీకాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోయిన సంవత్సరం ఐదుగురు గ్రేట్ అండమానీజ్ తెగవారికి కోవి్డ్ పాజిటివ్ వచ్చింది. సుమారు 35 మంది ఓంగే, జరవ తెగవారికి పరీక్షలు జరిపితే నెగెటివ్ వచ్చింది. “అన్ని తెగలవారు సురక్షితంగా ఉన్నారు. మానవజాతి వారసత్వ సంపద అయిన ఈ తెగలను కాపాడేందుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నాం” అని అప్పటి చీఫ్ సెక్రెటరీ చేతన్ సంఘీ ట్విట్టర్ లో తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ అండమాన్ టీకాల కార్యక్రమాన్ని సమన్వయపరుస్తున్నదని కేంద్ర గిరిజిన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా తెలిపారు. జరవ వంటి తెగలకు కరోనా నుంచి రక్షణ కల్పించే టీకాలు తప్పనిసరి అవసరమని ఆయన పేర్కొన్నారు. అయితే టీకాల కార్యక్రమంలో భాగంగా సంబంధిత అధికారులు మాత్రమే ఆదివాసీ గూడేలకు వెళ్లాలని, వారి ఏకాంతానికి భంగం కలిగించొద్దని స్పష్టం చేశామని ముండా వివరించారు. బయటివారికి ఉండే రోగనిరోధకత స్థానిక తెగలకు అంతగా ఉండదు. దీంతో వారు త్వరగా జబ్బు పడే అవకాశం ఉంటుంది.