న్యూఢిల్లీ : కరోనా కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. గురువారం ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లేఖ రాసింది. హర్యానా, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిఘా పెంచడంతో పాటు హాట్స్పాట్ల పర్యవేక్షణ, కొవిడ్-19 పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్, పరీక్షలు మెరుగుపరచడం, ఆసుపత్రులను బలోపేతం చేయడంతో పాటు టీకా పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు.
పాజిటివ్ వ్యక్తుల కాంటాక్టులను గుర్తించి పరీక్షలు చేయడంతో పాటు క్వారంటైన్, ఐసోలేషన్కు తరలించాలని ఆదేశించారు. కంటైన్మెంట్, బఫర్ జోన్ల ఏర్పాటుతో పాటు కొవిడ్ను ఎదుర్కొనేందుకు కఠినమైన, తగిన ఆంక్షలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. గురువారం భారత్లో 13,154 కరోనా పాజిటివ్ కేసులు, 268 మరణాలు నమోదయ్యాయి. మరో వైపు ఒమిక్రాన్ కేసులు సైతం 961కు పెరగ్గా.. ఇందులో 320 మంది బాధితులు ఆసుపత్రుల నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 22 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.