COVID-19 | కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. రెండున్నరేళ్లు దాటినా ఇంకా వెంటాడుతూనే ఉన్నది. మహమ్మారికి అంతం ఎన్నడు?.. సీజన్ను బట్టి కేసులు పెరుగుతాయా?.. ఇలా ఇంకా ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ చాలా మంది ప్రజల మదిలో తలెత్తుతున్నాయి. భారత్లో మరికొద్ది రోజుల్లో శీతాకాలం ప్రారంభంకానున్నది. ఈ పరిస్థితుల్లో మళ్లీ కరోనా ఉధృతి పెరుగుతుందా? అనే ప్రశ్న మరోసారి తలెత్తుతున్నది.
గత రెండేళ్ల డేటాను పరిశీలిస్తే సెప్టెంబర్ – అక్టోబర్ వరకు అదుపులో ఉన్న కేసులు.. నవంబర్ – డిసెంబర్ మధ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే, వైరస్ స్వభావాన్ని తెలుసుకునేందుకు అనేక అధ్యయనాలు జరిగినా.. కొవిడ్ వాతావరణం ఆధారిత ఇన్ఫెక్షన్ కాదని నివేదికలు పేర్కొన్నాయి. అయితే, అధ్యయాలను పరిగణలోకి తీసుకుంటే శీతాకాలంలో ప్రమాదంపై ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, గతంలోని రికార్డులను పరిశీలిస్తే.. ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. రాబోయే నెలల్లో చల్లని వాతావరణం నేపథ్యంలో మళ్లీ వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ కొవిడ్-19 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ -19తో మరణాల సంఖ్య తగ్గుతందన్నారు. పలు దేశాల్లో చలికాలం సమీపిస్తున్నదని, రాబోయే నెలల్లో మరోసారి కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. గతంలో చలికాలంలో కేసులు ఎక్కువయ్యాయన్నారు.
కొత్త వేరియంట్లతోనే ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ అన్నారు. వాటి నుంచి మరికొన్ని వేరియంట్లు పుట్టుకు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రమాదం ఉన్న వ్యక్తుల్లో ముఖ్యంగా.. తక్కువ ఆదాయ దేశాల్లో టీకా కవరేజీ ఇప్పటికీ తక్కువగా ఉందన్నారు.
కొత్త ఉత్పరివర్తనాల ఆవిర్భావం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొవిడ్ కేసులు తగ్గినప్పటికీ.. ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టలేదనే విషయాన్ని.. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఇదిలా ఉండగా.. చల్లని వాతావరణంలో ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతుందని కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజిస్ట్ డేవిడ్ రైల్మాన్ నేచర్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో పేర్కొన్నారు. ప్రయోగశాలల్లో నిర్వహించిన అధ్యయనాలు సార్స్-కోవ్-2 వైరస్ చల్లని, పొడి పరిస్థితుల్లో ఎక్కువ ఇన్ఫెక్షన్కు కారణమవుతుందని సూచిస్తున్నాయి.
ప్రస్తుతం కరోనాతో తేలికపాటి లక్షణాలు ఉండే అవకాశం ఉందని, అయినా.. అందరూ జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. సంక్రమణ కేసులను నియంత్రించకపోతే.. కొత్త ఉత్పతివర్తనాలు వచ్చే అవకాశం ఉందని.. వాటితో మరింత తీవ్రమైన వేరియంట్లు వచ్చేందుకు పరిస్థితులు దారి తీస్తాయన్నారు. ఈ రకమైన సంక్షోభాన్ని నివారించేందుకు.. ప్రజలందరూ కొవిడ్ తగిన ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని, కొవిడ్కు వ్యతిరేకంగా టీకాలు వేసినా.. నివారణ చర్యలు పాటించాలని సూచిస్తున్నారు.