న్యూఢిల్లీ : థర్డ్ వేవ్ ఆందోళన మధ్య కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. అతిత్వరలోనే చిన్నారులకు కొవిడ్ టీకాలు వేయనున్నట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. పిల్లల వ్యాక్సిన్కు సంబంధించిన ట్రయల్స్ జరుగుతున్నాయని.. జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న టీకాల ట్రయల్స్ ఫలితాలు వచ్చే నెలలో విడుదల కానున్నాయని చెప్పారు. అనంతరం వెంటనే టీకాలు వేయడం ప్రారంభించే అవకాశం ఉందన్నారు. పిల్లల కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధికి జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్కు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని, ట్రయల్స్ ఫలితాలు వచ్చే నెలలో వస్తాయని ఆశిస్తున్నట్లు రాజ్కోట్లో విలేకరులతో అన్నారు. ప్రతి పౌరుడికి టీకాలు వేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.