న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాల డ్రైవ్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 58కోట్ల మోతాదులకుపైగా పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. శనివారం రాత్రి 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు.. శనివారం 43లక్షలకుపైగా డోసులు వేసినట్లు చెప్పింది. 18-44 సంవత్సరాల మధ్య ఉన్న 20,88,547 మంది లబ్ధిదారులు మొదటి డోస్.. 7,36,870 మంది రెండో మోతాదు అందుకున్నారని పేర్కొంది. మూడో దశ టీకా డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి కేటగిరిలో 21,60,58,123 మందికి తొలి, 1,92,54,925 మందికి రెండో మోతాదు ఇచ్చినట్లు చెప్పింది. టీకా డ్రైవ్ 218వ రోజుకు చేరగా.. ఒకే రోజు 43,92,759 వ్యాక్సిన్లు వేశామని.. ఇందులో 27,77,409 మంది లబ్ధిదారులు మొదటి డోస్.. 16,15,350 మంది రెండో మోతాదు తీసుకున్నారని వివరించింది.