వాషింగ్టన్: కోవిడ్19 ఇన్ఫెక్షన్ వల్ల మానసిక సంబంధిత సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు అమెరికా అధ్యయనంలో తేలింది. సార్స్ సీవోవీ2 వైరస్ సోకిన కొన్ని నెలల తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశాలు ఉన్నట్లు ఓరేగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. కరోనా వైరస్ సంక్రమించిన నాలుగు నెలల తర్వాత పేషెంట్లలో 25 శాతం వరకు మానసిక సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. వరల్డ్ సైకియాట్రి జర్నల్లో దీనికి సంబంధించిన నివేదికను ప్రచురించారు.
కోవిడ్ వల్ల, ఇతర శ్వాస సంబంధిత వ్యాధుల వల్ల ఇబ్బందిపడిన పేషెంట్లలో తేడాను గమనించారు. దీని కోసం 46,610 మంది కోవిడ్ రోగుల్ని స్టడీ చేశారు. సైక్రియాట్రీ విశ్లేషణ కోసం రెండు టైమ్ పీరియడ్స్ను తీసుకున్నారు. వ్యాధి సోకిన 21 నుంచి 120 రోజుల వరకు, ఆ తర్వాత 120 నుంచి 365 రోజుల వరకు రోగుల్లో జరిగిన మానసిక మార్పుల్ని స్టడీ చేశారు. అయితే కోవిడ్ రోగుల్లో 3.8 శాతం రేటుతో మానసిక రుగ్మతలు డెవలప్ అవుతున్నాయని, ఇక ఇతర శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తుల్లో ఆ రేటు 3.0 శాతంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. 0.8 శాతం తేడా ఉందంటే అది 25 శాతం రిస్క్ పెరిగినట్లే అని తేల్చారు.