కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా ఆ ప్రభావం మాత్రం ఇంకా పోలేదు. గుండెపోటు, బ్లాక్ఫంగస్, కీళ్లనొప్పులు.. ఇలా శరీరంలోని అన్ని భాగాలనూ కొవిడ్ దొంగదెబ్బ తీసింది. ఇప్పటికీ, చాలా మందిని మధుమేహం వెంటాడుతున్నది. గతంలో మధుమేహ చరిత్ర లేనివారికి కూడా వైరస్ వచ్చిపోయిన తరువాత రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా పెరిగినట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. దీంతో ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అయితే కరోనా పీడితులకంతా డయాబెటిస్ వస్తుందా? ఎవరికి ఆ ప్రమాదం ఎక్కువ? వచ్చినా తాత్కాలికమా? శాశ్వతంగా భరించాల్సిందేనా? కరోనాకు, మధుమేహానికి ఉన్న ‘తీపి’ బంధంఏమిటి? తదితర విషయాల గురించి..
మధుమేహం అనేది శరీరంలో మూడు రకాల పదార్థాల ఉత్పత్తి పెరగడం వల్ల వస్తుంది.. అవి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్. వీటినే సాధారణ చక్కెరలుగా పిలుస్తారు. ఈ పదార్థాలు మనం తినే ఆహారంలో తిష్టవేసి తీపి రుచిని అందిస్తాయి. సాధారణంగా శరీరం పలురకాల సంక్లిష్ట పిండి పదార్థాలను గ్లూకోజ్గా మారుస్తుంది. అయితే రక్తంలోని గ్లూకోజ్ స్థాయి పెరగడంతో ప్యాంక్రియాటిక్ బీటా కణాలు ఇన్సులిన్ను విడుదల చేస్తాయి. అలా విడుదలైన ఇన్సులిన్ సమక్షంలో బీటా కణాలు శక్తిని ఉత్పన్నం చేయడానికి గ్లూకోజ్ను వినియోగించుకుంటాయి. ఇక ఫ్రక్టోజ్ విషయానికి వస్తే ఇది పండ్లలో, తీపి పానీయాలు, చల్లని ద్రవాలలో లభిస్తుంది. ఫ్రక్టోజ్ వల్ల ఊబకాయం వస్తుంది. కాలేయంలో కొవ్వు, ఇన్సులిన్ నిల్వలు పెరుగుతాయి. సుక్రోజ్ మనం వినియోగించే సాధారణ చక్కెర. ఇది చెరుకు నుంచి తయారవుతుంది. ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఈ మూడు పదార్థాలూ ఒక గ్రామునకు సమాన మోతాదులో క్యాలరీలను (అంటే శక్తిని) విడుదల చేస్తాయి. శరీరంలో అధికంగా విడుదలైన శక్తి కొవ్వుగా మారి రక్తంలో పేరుకుపోతుంది. ఫలితంగా ప్రధాన భాగాలైన గుండె, కిడ్నీలతో పాటు కండరాలకు రక్త సరఫరా సన్నగిల్లుతుంది. అంతే కాకుండా కొవ్వు పెరిగిపోవడంతో ఊబకాయం కూడా వస్తుంది. శరీరంలో తీపి పదార్థాల వల్ల అధిక శక్తి విడుదల అవుతున్నందున ఈ వ్యాధిని మధుమేహం అంటారు.
కరోనా రోగుల్లో
ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కరోనా రోగుల్లో వైరస్ తగ్గిన తరువాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి వైరస్ ప్యాంక్రియాజ్పై దాడి చేయడం. రెండు అధిక మోతాదులో స్టెరాయిడ్స్ వాడటం. ప్యాంక్రియాజ్లోని బీటా సెల్స్ దెబ్బ తినడం వల్ల కరోనా వైరస్లో ఏస్-2 రిసెప్టర్ ఉంటుంది. ఇది రోగి శరీరంలోని ఏ భాగంపై అయినా దాడి చేయవచ్చు. గుండెపై దండెత్తితే గుండె పోటు, రక్తనాళాలపై యుద్ధం ప్రకటిస్తే రక్తం గడ్డకట్టి రక ్తసరఫరా మందగించడం తదితర సమస్యలు ఎదురవుతాయి. అదే క్రమంలో ఏస్-2 రిసెప్టర్ రోగి శరీరంలోని ప్యాంక్రియాజ్లో ఉండే బీటా సెల్స్పై తెగ బడటం వల్ల ఇన్సులిన్ తగ్గిపోతుంది. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాజ్లో తయారవుతుంది. ఈ బీటా సెల్స్ ఇన్సులిన్ను తయారు చేస్తాయి. బీటా సెల్స్పై కరోనా వైరస్ ప్రభావం చూపడంతో ఈ కణాలు దెబ్బతిని, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా పెరిగిపోయి డయాబెటిస్ వస్తుంది.
స్టెరాయిడ్స్ వాడటం వల్ల
సాధారణంగా స్టెరాయిడ్స్ వాడటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కరోనా రోగుల విషయంలో వైరస్ ఊపిరితిత్తులపై ఎటాక్ చేయడం వల్ల చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. ముఖ్యంగా మధ్యస్థ, తీవ్ర లక్షణాలున్న రోగులకు స్టెరాయిడ్స్ అనివార్యం. ఈ క్రమంలో స్టెరాయిడ్స్ అధికంగా వాడిన రోగులలో ఆ తర్వాత, షుగర్ లెవల్స్ పెరగడం కనిపించింది.
అందరికీ రాదు
కరోనా సోకిన ప్రతి రోగిలో మధుమేహం కనిపించదు. కుటుంబ నేపథ్యం ఉండి డయాబెటిస్ వచ్చే సూచనలున్న వారికి, అధిక బరువు, ఊబకాయం తదితర సమస్యలు ఉన్నవారికి, అధికంగా స్టెరాయిడ్స్ వాడిన వారికి, కరోనా మధ్యస్థ, తీవ్రస్థాయి లక్షణాలతో బాధపడి.. ఆ ప్రభావం ప్యాంక్రియాజ్పై పడిన వారిలో మాత్రమే పోస్ట్ కరోనాలో మధుమేహ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. అయినా తాత్కాలికమే ప్రీ-డయాబెటిస్, ఊబకాయం, అధిక బరువు తదితర సమస్యలు ఉన్న వారికి కరోనా తర్వాత డయాబెటిస్ వస్తే మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకుండా, ప్రీ-డయాబెటిక్ కూడా కాని సాధారణ వ్యక్తులకు పోస్ట్ కరోనాలో డయాబెటిస్ వస్తే అది తాత్కాలికమే. కొన్ని రోజులు ఇన్సులిన్, మందులు వాడిన తరువాత షుగర్ లెవల్స్ సాధారణ స్థాయికి చేరుతాయి. ఆ తరువాత మందులతో అవసరం ఉండకపోవచ్చు.
మధ్యస్థ, తీవ్ర లక్షణాలకు గురైతే
మధ్యస్థ, తీవ్ర లక్షణాలకు గురైన కరోనా రోగులు, ముఖ్యంగా స్టెరాయిడ్స్ వాడినవారు కచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. చాలా మందిలో సమస్య తీవ్రమయ్యే వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ కనిపించవు. హఠాత్తుగా అనారోగ్యం తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, 30 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ షుగర్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.
లక్షణాలు
అతిగా దాహం, అతిగా నీరసం.
అతి మూత్రం, అతిగా ఆకలి.
చూపు మసకబారడం.
అసాధారణంగా బరువు తగ్గిపోవడం.
గాయాలు మానకపోవడం.
దెబ్బతినే భాగాలు..
కిడ్నీలు, కండరాలు, ఊపిరితిత్తులు, గుండె, నరాలు, కీళ్లు, కళ్లు చక్కెర స్థాయులు (మి.గ్రా)..
..పరగడుపున (అల్పాహారానికి ముందు) 110 కంటే తక్కువ, భోజనం చేసిన రెండు గంటల్లోపు అయితే 140 లోపు ఉండటం ఆరోగ్యకరం. అల్పాహారానికి ముందు (పరగడుపున) 126 కంటే ఎక్కువ ఉంటే, భోజనం తరువాత 200 కంటే అధికంగా ఉంటే షుగర్ ఉన్నట్టు, ఇక నుంచి మధుమేహ రోగులుగా పరిగణిస్తారు. తగిన మందులు సూచిస్తారు. ఈ మధ్యలో ఉన్నవారు అంటే అల్పహారానికి ముందు 110 కంటే ఎక్కువగా 126 లోపు ఉంటూ, భోజనం తరువాత 140కంటే ఎక్కువగా 200లోపు ఉంటే వారికి షుగర్ వచ్చే సూచనలున్నట్లు పరిగణిస్తారు. వారినే ప్రీ-డయాబెటిక్ అంటారు. సకాలంలో చికిత్స తీసుకుంటే షుగర్ లెవల్స్ను నియంత్రించి వ్యాధి దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చు. అంతేకాదు, రోజూ వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి. ఊబకాయం రాకుండా చూసుకోవాలి. బరువు నియంత్రించుకోవాలి. పిండి పదార్థాలు, తీపి పదార్థాలు మితంగా తీసుకోవాలి.
-మహేశ్వర్రావు బండారి
డాక్టర్ రాకేష్ కుమార్ సాహె
ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడీ,
ఎండోక్రైనాలజి విభాగం
ఉస్మానియా హాస్పిటల్, ఓఎంసీ