న్యూఢిల్లీ : కరోనాకు వ్యతిరేకంగా కోవోవాక్స్ టీకాను బూస్టర్గా వేసేందుకు థర్డ్ఫేజ్ ట్రయల్స్ నిర్వహించేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డీసీజీఐ అనుమతి కోసం దరఖాస్తు చేసింది. ఇప్పటికే కంపెనీ ఉత్పత్తి చేసిన టీకా అత్యవసర వినియోగానికి డిసెంబర్ 28న అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కోవోవాక్స్ టీకాకు అనుమతి ఇచ్చింది. అయితే, ఇప్పటి వరకు టీకాను జాతీయ టీకాల పంపిణీ కార్యక్రమంలో చేర్చలేదు.
కోవోవాక్స్ బూస్టర్ డోస్గా ఇవ్వడానికి భద్రత, ఇమ్యునోజెనిసిటీని అంచనా వేసేందుకు థర్డ్ ఫేజ్ ట్రయల్స్ కోసం గతవారం దరఖాస్తు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మూడు నెలల కిందట కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు తీసుకున్న వారిపై ట్రయల్స్ నిర్వహించేందుకు కంపెనీ దరఖాస్తు చేసింది. ఇప్పటికే చాలా దేశాలు ఇప్పటికే తమ పౌరులకు బూస్టర్ డోసులు ఇస్తున్నాయని సీరమ్ ఇన్స్టిట్యూట్లో ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్కుమార్ సింగ్ దరఖాస్తులో పేర్కొన్నారు.