న్యూఢిల్లీ: కొత్తగా మోడెర్నా కోవిడ్ టీకాకు అనుమతి ఇచ్చినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయంగా డెవలప్ చేసిన తొలి కోవిడ్ టీకా మోడెర్నానే. అయితే నియంత్రిత పద్ధతిలో ఆ టీకాను వినియోగించేందుకు అనుమతి ఇచ్చినట్లు డాక్టర్ పౌల్ తెలిపారు. ఇండియాలో ఇక కోవాగ్జిన్, కోవీషీల్డ్, స్పుత్నిక్, మోడెర్నా టీకాలు అందుబాటులో ఉంటాయన్నారు. అమెరికాకు చెందిన మరో కంపెనీ ఫైజర్తోనూ త్వరలో డీల్ను కుదుర్చుకోనున్నట్లు డాక్టర్ పౌల్ వెల్లడించారు.
పాలిచ్చే తల్లులకు ఈ నాలుగు రకాల టీకాలు సేఫ్ అని, ఇక వంధత్వంతోనూ వ్యాక్సిన్లకు సంబంధంలేదని నీతి ఆయోగ్ సభ్యుడు చెప్పారు. దేశవ్యాప్తంగా 27.27 కోట్ల మందికి తొలి డోసు కోవిడ్ టీకా అందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మరో 5.84 మంది రెండవ డోసు వేయించుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. రికవరీ రేటు 96.9 శాతంగా ఉందన్నారు.
దేశంలో ఇప్పటి వరకు 51 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. ప్రెగ్నెంట్ మహిళలకు టీకాల విషయంపై త్వరలో మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నట్లు డాక్టర్ పౌల్ తెలిపారు. గర్భిణులకు టీకాలు సేఫ్ అని, అయితే ఆరోగ్యశాఖ ఈ అంశంపై మరింత అధ్యయనం చేస్తోందన్నారు. మోడెర్నా టీకా తొలి అంతర్జాతీయ వ్యాక్సిన్ అని, రెండు డోసుల్లో ఆ టీకాలను వేయనున్నట్లు ఆయన వెల్లడించారు.