సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): మద్యం మత్తులో తల్లి, చెల్లి, భార్యా పిల్లలను హింసిస్తున్న ఒక వ్యక్తికి న్యాయస్థానం ఏడున్నర నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్ ప్రాంతంలో నివాసముండే తుపటి సాయిబాబా కూలీ. ఈనెల 11వ తేదీ రాత్రి సంజీవయ్యనగర్లో నివాసముండే తల్లి ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు సుత్తితో పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. ఇంట్లో ఉన్న తల్లి, చెల్లెలను హింసించాడు. దాంతో పాటు భార్యా పిల్లలను కూడా తీవ్రంగా హింసించాడు.
అతడి వేధింపులు తట్టుకోలేక తల్లి బాలనర్సమ్మ మారేడ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. 15వ మేజిస్ట్రేట్ కోర్టు నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ. 1350 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో 45 రోజులు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది న్యాయస్థానం తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించకపోవడంతో నిందితుడికి 225 రోజుల జైలు శిక్ష ఖరారయ్యింది. నిందితుడి గతంలో కూడా జైలుకు వెళ్లాడని, అయినా అతడి ప్రవర్తలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు.