ప్రఖ్యాత యాపిల్ కంపెనీకి కోర్టు షాకిచ్చింది. ఒక భారతీయుడి ఐఫోన్ రిపేర్ చేయలేకపోయినందుకు రూ.92 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అతీక్ అంజుమ్ (26) అనే యువకుడికి అతని సోదరుడు ఒక ఐఫోన్ బహుమతిగా ఇచ్చాడు. బహ్రెయిన్లో ఉండే అతను 2018 ఆగస్టు 15న అతీక్కు ఐఫోన్ ఇచ్చాడు.
అప్పట్లో రూ.92 వేలకు ఈ ఫోన్ కొన్నారు. 2019లో ఐఫోన్ వారంటీని మరో ఏడాది పొడిగించుకునేందుకు రూ.4,500 చెల్లించాడు అతీక్. మే నెలలో ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోగా జులై నాటికి టచ్, స్పీకర్ ప్రాబ్లం వచ్చింది. చిక్కమగళూరులో నివశించే అతీక్.. మొబైల్ రిపేర్ చేయించుకోవడానికి ఆథరైజ్డ్ యాపిల్ సర్వీస్ సెంటర్కు వెళ్లాల్సి వచ్చింది. అది 250 కిలోమీటర్ల దూరంలోని కోరమంగళలో ఉంది. అక్కడకు వచ్చి మొబైల రిపేర్ చేయించుకున్న అతీక్ తిరిగెళ్లాడు.
అతను వెళ్లిన మరుసటి రోజే వేరే సమస్యలు వచ్చాయి. స్క్రీన్పై పచ్చ రంగు చుక్కలు కనిపించడం మొదలైంది దాంతో మళ్లీ కోరమాంగళ వచ్చాడు. స్క్రీన్ రిపేర్ చేయించుకొని వెళ్తే మళ్లీ సమస్య వచ్చింది. ఇదేంటని అడిగితే స్పీకర్ మెష్ చెడిపోయిందని టెక్నీషియన్లు చెప్పారు. ఇది బయటి కారణాల వల్ల జరిగిన డ్యామేజి అని, కాబట్టి వారంటీలో కవర్ అవదని అన్నారు. రిపేర్ చేయించుకోవాలంటే రూ.59 వేలు అవుతుందన్నారు. దీంతో షాకైన అతీక్.. యాపిల్ సంస్థకు, సదరు సర్వీస్ సెంటర్కు లీగల్ నోటీసులు పంపాడు.
కోర్టులో వాదనల సందర్భంగా బాహ్య కారణాల వల్ల జరిగిన డ్యామేజీని జాలి తలచి రిపేరు చేశామని, అతీక్ కృతజ్ఞత లేకుండా పరిస్థితిని ఉపయోగించుకోవడానికి చూస్తున్నాడని యాపిల్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే అలా జాలితో రిపేర్ చేయాల్సిన అవసరం యాపిల్ సంస్థకు లేదన్న జడ్జి.. మొబైల్కు జరిగిన డ్యామేజ్ వినియోగదారుని వద్దే జరిగినట్లు సంస్థ నిరూపించలేకపోయిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అతనికి అయితే కొత్త ఐఫోన్ ఇవ్వాలని, లేదా రూ.92 వేలు చెల్లించాలని చెప్పింది. దీనికితోడు అతీక్ నష్టానికి ఒక రూ.10 వేలు, కోర్టు ఖర్చులకు మరో రూ.10 వేలు కూడా చెల్లించాలని ఆదేశించింది.