పుణె, మార్చి 30: చిరుతను దూరం నుంచి చూస్తేనే దడుచుకుంటాం. అలాంటిది దానితో పోరు అంటే పక్కాపరారవుతాం. కానీ, మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన మహిళ చిరుతతో పోరాడి దాని దాడి నుంచి భర్తను కాపాడుకున్నది. ఈ సాహస ఘటన అహ్మద్నగర్ జిల్లాలోని పార్నర్ తహసిల్ దరోడి గ్రామంలో గత శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. దరోడి గ్రామానికి చెందిన గోరఖ్ దశరథ్ పావడే, సంజన పావడే దంపతులు. రోజు మాదిరిగానే కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో నిద్రపోయారు. బయట అలికిడితో సంజనకు మెలకువ వచ్చింది. బయట చిరుతను గమనించి భర్త దశరథ్ను లేపింది.
భర్త బయటకు వచ్చి చూస్తుండగా.. ఒక్కసారిగా చిరుత అతడిపై దాడిచేసింది. అతడి వీపును పట్టుకొనేందుకు ప్రయత్నించింది. సంజన వెంటనే పరిగెత్తుకొచ్చి చిరుత దాడి నుంచి భర్తను విడిపించేందుకు దాని తోక పట్టుకొని వెనుకకు లాగేందుకు ప్రయత్నించింది. ఈలోగా పెంపుడు కుక్కతో దశరథ్ తండ్రి అక్కడికి వచ్చి కట్టెలు, గ్రానైట్ రాళ్లతో చిరుతను కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో అతడిపై చిరుత పట్టుకోల్పోయింది. వెంటనే అతడు దూరంగా జరిగాడు. చిరుత పారిపోయింది.