అమరావతి : కరోనా భయంతో తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కొవిడ్ సోకిందన్న భయంతో తీవ్ర మనస్తాపానికి గురై దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెడన గ్రామంలో గురువారం రాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన లీలాప్రసాద్ (40), భారతి (38) ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తమకు కరోనా సోకిందన్న భయంతో నాటి నుంచి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కొవిడ్ వచ్చినా సకాలంలో చికిత్స తీసుకుంటే చనిపోయేంత ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నా.. కొందరు అనవసర భయం, తొందరపాటుతో తనువు చాలిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.