లక్నో : ఓ ఇద్దరు దంపతులు మ్యాట్రిమోని సైట్లో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి రూ. 1.6 కోట్లు మోసం చేశారు. ఈ మోసానికి పాల్పడిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మోర్దాబాద్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్క చెందిన బబ్లూ కుమార్, పూజా కుమారి(బీహార్) కొన్నేండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఇక మోర్దాబాద్లో నివాసముంటూ, ఓ మ్యాట్రిమోని వెబ్సైట్ను నిర్వహిస్తున్నారు. ఆ సైట్లో అందమైన అబ్బాయిలు, అమ్మాయిల ఫోటోలను పెట్టి, ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించేవారు. ఇక వివాహం కోసం సంప్రదించే అమ్మాయిలు, అబ్బాయిలను మోసం చేస్తూ రూ. 1.6 కోట్లు వసూలు చేశారు.
అయితే ఓ వ్యక్తి తన కూతురికి పెళ్లి సంబంధం చూపిస్తామని చెప్పి, రూ. 27 లక్షలు వసూలు చేశారు. కానీ అబ్బాయిని చూపించకపోవడంతో మోసపోయామని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశానని అతను పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. మొత్తం 35 మందిని ఈ దంపతులు మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం దంపతులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.