న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ ప్రణాళిక, దేశానికి సంబంధించిన విధాన రూపకల్పన కేవలం ప్రభుత్వ ప్రక్రియకే పరిమితం కావద్దని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పథకంపై వెబినార్లో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. దేశ అభివృద్ధిలో ప్రతి భాగస్వామి పాలుపంచుకోవాలని, చురుకైన పాత్ర పోషించాలని ప్రధాని సూచించారు. దేశంలో తయారీరంగాన్ని ఉరకలెత్తించడానికి మనం భారీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మన దేశ కంపెనీలు ప్రపంచస్థాయి కంపెనీలతో పోటీపడేలా చేయడం కోసం అహర్నిశలు కృషిచేయాల్సిన అసవరం ఉందన్నారు.
ఏడాదిపాటు కరోనా మహమ్మారి ప్రభావాన్ని అనుభవించి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున తయారీరంగంలో దేశాన్ని పరుగులు తీయించడం మన బాధ్యతగా భావిస్తున్నానని, ఇది కేవలం అవకాశం మాత్రమే అనుకోవడం లేదని ప్రధాని చెప్పారు. తయారీరంగం దేశ ఆర్థికవ్యవస్థలోని ప్రతి సెగ్మెంట్లో మార్పులు తెస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తయారీరంగంలో వరుసగా సంస్కరణలు తీసుకొస్తున్నదని, తాము కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన అనే సిద్ధాంతాన్ని నమ్ముతున్నామని చెప్పారు.