Gutha Sukhender Reddy | నల్లగొండ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రైతు దినోత్సవం సందర్భంగా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని రైతు వేదికలో జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక రైతులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. నల్గొండ జిల్లా రైతాంగానికి వ్యవసాయ పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ. 10 వేల చొప్పున రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో 4 లక్షల 83 వేల 179 మంది రైతులకు 5 వేల 243 కోట్ల 99 లక్షల రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. దురదృష్ఠవశాత్తు ఏ రైతు అయిన మరణించినచో 10 రోజుల్లో అతని కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల బీమా సొమ్మును రైతు బంధు పథకం ద్వారా అందిస్తున్నామని అన్నారు . ఈ పథకం ద్వారా 2018 నుండి 2023 ఏప్రిల్ వరకు 6 వేల 256 మంది రైతు కుటుంబీకులకు 312 కోట్ల 8 లక్షల రూపాయలు అందించామని ఆయన తెలిపారు.
పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ, రైతులను ఆదుకొంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. జిల్లాలో 2014-15 నుండి 2022-23 వరకు 63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ. 10 వేల 879 కోట్లు రైతులకు చెల్లించడం జరిగిందని చెప్పారు. వ్యవసాయ సంబంధమైన సాంకేతిక పరిజ్ఞానం ఇతర అంశాలపై రైతులు చర్చించుకుందుకు వీలుగా ప్రతి 5 వేల ఏకరాల క్లస్టర్లకు ఒక రైతు వేదికను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో 2600 రైతు వేదికలను సర్కార్ నిర్మించిందన్నారు. నల్గొండ జిల్లాలో 140 క్లస్టర్ గ్రామాలలో రూ. 30 కోట్ల 80 లక్షలతో 140 రైతు వేదికలు నిర్మించామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సహం అందిస్తున్నదని తెలిపారు. ఆయిల్ ఫామ్ మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్లకు భారీ సబ్సిడీని సర్కార్ అందిస్తుందని అన్నారు. అలాగే ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
పిలాయిపల్లి కెనాల్, ధర్మ రెడ్డి కెనాల్ పనులు దగ్గర పడ్డాయి. రానున్న వర్షాకాలంలో ఆ కాలువల ద్వారా చెరువులను నింపుతామని ఆయన తెలిపారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్నీ ప్రజలు ఆదరించాలని, రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి తానే స్వయంగా రైతులందరికీ భోజనాలు వడ్డించారు.
ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ జేడీఏ సుచరిత, ఏవో గిరిబాబు, ఏఈవో వికాస్, ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటీసీ సుంకరి ధనమ్మ యాదగిరి, ఎంపీటీసీ సత్యం, తాళ్ల వెల్లంల, వెంబావి, నేరేడ, గ్రామ సర్పంచ్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గుత్తా యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.