నల్లగొండ: రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులు, స్వాతంత్య్ర సమరయోధులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జోహార్లు అర్పించారు. వారి త్యాగాలతోనే నేడు మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో విలీనమై 75 వసంతాలవుతున్న సందర్భంగా సమైక్యతా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా నల్లగొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందన్నారు. చరిత్రలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు.
‘దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రానికై పోరాడుతూనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండగా మెజారిటీ సంస్థానాలు భారత యూనియన్లో విలీనమయ్యాయి. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నాటి నిజాం ప్రకటించారు. సంస్థానంలో భూస్వాములు, జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్ముఖ్లు ప్రజలను రకరకాలుగా వేదించారు. రైతులు కౌలు కింద చేతికి అందిన పంటలో అగ్రభాగం చెల్లించాల్సి వచ్చింది. 85 శాతం ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై అణచివేత, వెట్టిచాకిరి, బానిసత్వం కొనసాగింది. మరోవైపు ప్రైవేటు సైన్యం, రజాకార్ల దమనకాండ కొనసాగింది. దీంతో ప్రజలు నిజాం పాలకులకు ఎదురు తిరిగారు’ అని మండలి చైర్మన్ తెలిపారు.
‘నాడు జరిగిన ప్రజాపోరాటాల్లో అప్పటి నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించింది. జిల్లా నుంచి భీంరెడ్డి నర్సింహా రెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షమ్, ఆరుట్ల రామచంద్రరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జిట్ట రామచంద్రరెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, సుశీల దేవి, సుద్దాల హనుమంతు వంటి ఎందరో త్యాగధనులు తెలంగాణలో స్వాతంత్రోద్యమాన్ని ప్రభావితం చేశారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటిసారి అసువులు బాసిన దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైనది. ఇందులో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైనది.
బండి యాదగిరి రాసిన ‘బండెనకబండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లో పోతావు కొడుకో.. నైజాం సర్కారోడా…’ పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి రాచరిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చ్కెతన్యం రగిలించింది. ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణా సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.
భూస్వామ్య జమీందార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అప్పటి నల్లగొండ జిల్లాలోని గుండ్రాంపల్లి, కడవెండి, రావులపెంట, ఏనెమీదిగూడెంక ప్రాంతాలు ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయి. అంతే కాకుండా వీటన్నింటికి పరాకాష్టగా 1948 ఆగస్టు 27న జరిగిన భైరాన్పల్లి ఘటన మరవరానిది. ఆ తరువాత 21 రోజులలోనే హైదరాబాదు సంస్థానం భారత యూనియన్లో చేరిందని గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.