హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): మార్కెట్లో భారీ డిమాండ్ ఉండటంతో ఈ సీజన్లో అధిక విస్తీర్ణంలో పత్తి సాగుపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. 1.42 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేయగా అందులో సగం విస్తీర్ణం అంటే 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేసేలా ప్రణాళిక రచించింది. వరిసాగును 45 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలని అధికారులు నిర్ణయించారు.
15 లక్షల ఎకరాల్లో కంది, 3.5 లక్షల ఎకరాల్లో సోయాబీన్ను సాగుచేయాలని ప్రణాళిక రూపొందించింది. గత వానకాలంలో అన్ని పంటలు కలిసి 1.29 కోట్ల ఎకరాల్లో సాగయ్యాయి. దాదాపు 62 లక్షల ఎకరాల్లో వరి, 46.42 లక్షల ఎకరాల్లో పత్తి పండించారు. ధాన్యం కొ నుగోలుపై కేంద్రం కొర్రీలు పెడుతుండటంతో వరిని తగ్గించి పత్తి సాగును పెంచాలని అధికారులు భావిస్తున్నారు.
పంటల సాగుకు అనుగుణంగా విత్తనాలను, ఎరువులను వ్యవసాయశాఖ సిద్ధంచేసింది. 1.42 కోట్ల ఎకరాల్లో వివిధ పంటల సాగుకు 14.41 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనావేయగా 20.25 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచింది. రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ వద్ద 1.81 లక్షల క్వింటాళ్లు, వ్యవసాయ వర్సిటీ వద్ద 15,460 క్వింటాళ్లు, రైతుల వద్ద 49 వేల క్వింటాళ్లు, ప్రైవేట్ కంపెనీల వద్ద 17.57 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.
సీజన్కు అవసరమైన ఎరువులను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. 24.45 లక్షల టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇందులో యూరియా 10.50 లక్షల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 9.20 లక్షల టన్నులు అవసరం అవుతాయని అంచనా. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల కొరత వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ర్టానికి అవసరమైన ఎరువులను విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు.
ఇప్పటికే క్షేత్రస్థాయిలో 9 లక్షల టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచారు. ఈ సీజన్లో వరికి బదులుగా ఇతర పంటల సాగుపై రైతులను ప్రోత్సహించేలా వ్యవసాయశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఏఈవోలు రైతు వేదికల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పత్తి సాగు, ఎరువుల వాడకం, పచ్చిరొట్ట పైర్ల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులను ప్రోత్సహిస్తున్నారు.