హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): పత్తి రైతులకు ఈ ఏడాది కూడా మంచి ధర లభించే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రకారం ఈ సీజన్లో క్వింటాల్ పత్తి ధర రూ.8-12 వేల వరకు ఉంటుందని అంచనా. రెండురోజుల క్రితం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో తొలి కాత పత్తి క్వింటాల్కు రూ.8,199 పలికింది. డిసెంబర్ నాటికి సగటున రూ.10 వేలు దాటొచ్చని వ్యాపారుల అంచనా. నిరుడు కూడా క్వింటాల్ పత్తి ఓ దశలో రూ.13 వేల వరకు పలికింది. ఈ ఏడాది పొడవు గింజ రకపు పత్తికి మద్దతు ధర క్వింటాల్కు రూ.6,380 కాగా మధ్యస్థ గింజ రకానికి రూ.6,080గా నిర్ణయించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం మద్దతు ధర కన్నా సుమారు 70-80% అధిక ధర పలికే అవకాశం ఉన్నది. బహిరంగ మార్కెట్లోనే మద్దతుకు మించిన ధర లభించే అవకాశాలు ఉండటంతో ఈ ఏడాది కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసే అవకాశం లేదని భావిస్తున్నారు. మొత్తం పంటను బహిరంగ మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తున్నది. యూరప్లో ఆర్థికమాంద్యం నేపథ్యంలో డిసెంబర్ తర్వాత పత్తి ధర కొంత పడిపోయే అవకాశం ఉన్నదని పత్తి వ్యాపారులు చెప్తున్నారు. ఇదే జరిగితే అప్పుడు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు.
ఈ ఏడాది రాష్ట్రంలో పత్తి 50 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి విత్తే కీలక సమయంలో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు పత్తి సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపాయి. లేదంటే సుమారు 70 లక్షల ఎకరాల వరకు సాగయ్యేది. ఈ ఏడాది సుమారు 30 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా. ఈ ఏడాది పత్తి సాగులో నల్లగొండ జిల్లా టాప్లో నిలిచింది. ఈ జిల్లాలో అత్యధికంగా 6.47 లక్షల ఎకరాల్లో సాగు కాగా ఆదిలాబాద్లో 4.05 లక్షల ఎకరాల్లో సాగైంది.