నల్లగొండ : జిల్లాలోని పీఏపల్లి మండలం గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోపాల్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణ నేపథ్యంలో ఎస్ఐను సస్పెండ్ చేస్తూ డీఐజీ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. భూ వివాదాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని, పలు కేసుల్లో బాధితులను పట్టించుకోవడం లేదని ఎస్ఐ గోపాల్ రావుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలపై విచారణ చేసిన ఎస్పీ నివేదిక ఇచ్చారు. ఎస్పీ నివేదిక ఆధారంగా ఎస్ఐను సస్పెండ్ చేస్తూ బుధవారం డీఐజీ ఉత్తర్వులు ఇచ్చారు.