కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. నిన్నమొన్నటి వరకు 60 ఏండ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ అందజేయగా.., గురువారం నుంచి 45 ఏండ్లు పైబడిన వారికి సైతం టీకా ఇస్తున్నారు. అయితే టీకా తీసుకున్నప్పటికీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని నిపుణులు తెలుపుతున్నప్పటికీ ప్రజలు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. టీకా వచ్చింది కదా.. నాకేమైతది అనే ధీమాతో కనీస నిబంధనలు పాటించకుండా జనం రోడ్లమీద విచ్చల విడిగా సంచరిస్తున్నారు. దీంతో మొన్నటి వరకు అంతంత మాత్రంగా ఉన్న వైరస్ ఒక్కసారిగా పంజా విసురుతున్నది. ఇటీవల కాలంగా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు వ్యాక్సిన్ అందజేస్తూనే.. మరోవైపు కరోనా పరీక్షల సంఖ్యను పెంచింది. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని పేర్కొంటూ.. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
కరోనా వైరస్కు ముకుతాడు వేసేందుకు టీకా ఒక్కటే ప్రత్యామ్నాయంగా వైద్యులు చెబుతున్నారు. కరోనా నియమాలతో పాటు వైరస్ తీవ్రతను అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ అత్యవసరమంటున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 16న హెల్త్కేర్ వర్కర్లతో ప్రారంభమైన టీకా పంపిణీ ప్రక్రియను దశల వారీగా సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెలలో 60ఏండ్ల వయస్సు పైబడిన సాధారణ జనాలకు అందుబాటులోకి తీసుకువచ్చిన టీకా పంపిణీని తాజాగా గురువారం నుంచి 45ఏండ్లు పైబడిన సాధారణ ప్రజలందరికీ పంపిణీ చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
గ్రేటర్ పరిధిలోని అన్ని పీహెచ్సీలలో ఇక నుంచి వ్యాక్సినేషన్ను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో 85 పీహెచ్సీలు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో 70పీహెచ్సీలతో పాటు ప్రైవేటు దవాఖానల్లో కూడా టీకాను వేస్తున్నారు. 45 ఏండ్ల పైబడిన వారికి టీకా పంపిణీ ప్రారంభించిన తొలిరోజు గ్రేటర్ వ్యాప్తంగా 15,172 మంది టీకా వేయించుకున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 6972మందికి, మేడ్చల్ జిల్లా పరిధిలో 8200మందికి టీకా పంపిణీ చేశారు. ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు నేరుగా వచ్చిన వారికి కూడా టీకా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మొదటి డోస్ వేసుకుని 28రోజులు గడిచిన వారికి రెండవ డోస్ను కూడా నిర్ణీత తేదీ ప్రకారం వేస్తున్నట్లు పేర్కొన్నారు. వైరస్ విజృంభన అధికంగా ఉండటంతో మరో పక్క కరోనా పరీక్షల సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. గ్రేటర్ పరిధిలో ఆర్టీపీసీఆర్ కేంద్రాలను కూడా పెంచినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రధాన ప్రభుత్వ దవాఖానలు, వైద్యవిధాన పరిషత్ పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో సైతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.