Coronavirus | కొవిడ్-19 ఇంకా మనల్ని వదిలిపెట్టడం లేదు ! కరోనా వైరస్ తగ్గిపోయినా కూడా దాని ప్రభావాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. జుట్టు రాలడం నుంచి గుండెపోటు ముప్పు వరకు రకరకాలుగా బాధిస్తూనే ఉన్నది. ఒక్కసారి కరోనా సోకితే వయసుతో సంబంధం లేకుండా హృద్రోగాల బారిన పడ్డట్టేనని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే కొవిడ్ బారిన పడటం వల్ల మాత్రమే కాదు.. ఇన్నిరోజులు వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇంటికే పరిమితమైన ఉద్యోగులు.. ఒక్కసారిగా వాళ్ల డైలీ యాక్టివిటీస్తో బిజీ అవ్వడం వల్ల కూడా గుండెపోటు ముప్పు పెరిగిందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్ ఊపిరితిత్తులతో పాటు రక్తనాళాలపైనా ప్రభావం చూపుతుంది. దీనివల్ల శరీరంలో ఇతర ప్రధాన అవయవాలు కూడా దెబ్బతింటాయి. మెదడుతో ముడిపడిన రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టిపోయి, అవరోధం ఏర్పడితే బ్రెయిన్స్ట్రోక్ రావచ్చు. గుండెకు అనుసంధానమైన రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండెపోటు రావచ్చు. కాళ్లకు సంబంధించిన రక్తనాళాలు బ్లాక్ అయితే, కాళ్లు చచ్చుబడిపోయి గ్యాంగ్రీన్ వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాకుండా కాళ్లలో డీవీటీ (డీప్ వీన్ థ్రాంబోసిస్) వస్తే కాళ్లు వాచి పల్మనరీ ఎంబాలిజానికి దారి తీయవచ్చు. దీనివల్ల రోగి హఠాన్మరణానికి గురికావచ్చు. ఇదే విషయాన్ని హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులు, సీనియర్ హృద్రోగ నిపుణులు డాక్టర్ కే. ప్రమోద్ కుమార్ తెలిపారు.
కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత హృద్రోగాలు, గుండె వైఫల్యం, పల్మనరీ ఎంబాలిజమ్ ( ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి రక్తసరఫరా ఆగిపోవడం ) వంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని డాక్టర్ ప్రమోద్ కుమార్ వెల్లడించారు. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధక శక్తి దెబ్బతినడంతో పాటు పలు వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇంటికే పరిమితం కావడం, సరైన వ్యాయామం లేకపోవడం, మానసికాందోళన వంటివి ఈ సమస్యకు కారణమని ఆయన వివరించారు.
కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేండ్ల పాటు ఇంటికే పరిమితమైన జనాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. పలు ఆఫీసులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కు స్వస్తి పలకడంతో ఉద్యోగులకు తిరిగి ఆఫీసులకు వెళ్తున్నారు. ఒక్కసారిగా రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా అయిపోయారు. ఇలా సడెన్గా రెగ్యులర్ యాక్టివిటీస్తో బిజీ అయిపోవడంతో పని ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. ఇది కూడా గుండెపోటు కేసులు పెరగడానికి ఒక కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే పోస్ట్ కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేయించుకోవడం అవసరమని సలహా ఇస్తున్నారు.
“కుటుంబాన్ని కాటేసిన కరోనా.. 24 రోజుల్లో 8 మంది బలి.. మహిళల మనోవేదన ఇదీ..”
“Coronavirus | కరోనా వల్ల బుర్ర సైజు తగ్గుతుంది.. వెల్లడించిన శాస్త్రవేత్తలు”
“Coronavirus | కరోనా పేషెంట్లు ఐసీయూ పాలవడానికి కారణం ఏంటి?.. సంచలన విషయాలు బయటపెట్టిన సైంటిస్టులు!”