న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రెండో విడుత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. ఇందులో భాగంగా పార్లమెంటులోనూ మంగళవారం నుంచి కొవిడ్ టీకా పంపిణీ చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రెండు వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో పార్లమెంటు సభ్యులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా టీకా తీసుకునే అవకాశం ఉన్నది. శనివారం నాటికి దేశవ్యాప్తంగా 2.06 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మొదటి విడుత వ్యాక్సినేషన్ జనవరి 16న, రెండో విడుత ఈనెల 1న ప్రారంభమయ్యింది. ఫస్ట్ ఫేజ్లో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ ఇవ్వగా, రెండో విడుతలో 60 ఏండ్లు పైబడినవారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏండ్లు పైబడినవారికి టీకా పంపిణీ చేస్తున్నారు.
కాగా, నేటి నుంచి పార్లమెంటు రెండో విడుత బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సోమవారం ఉదయం 11 గంటల నుంచి రెండు సభల్లో (లోక్సభ, రాజ్యసభ) ఏకకాలంలో కార్యకలాపాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నది. పింఛను నిధి నియంత్రణ-అభివృద్ధి ప్రాధికారిక సంస్థ సవరణ బిల్లు, జాతీయ బ్యాంకుల బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, క్రిప్టో కరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లు సభ ముందుకు రానున్నాయి. అయితే షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశాలు ఏప్రిల్ 8 వరకు జరగాల్సి ఉన్నాయి. అయితే నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలితప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సమావేశాలను కుదించే అవకాశం ఉన్నది. దాదాపు రెండు వారాలపాటు సమావేశాలను కుదించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై ఇవాళ జరిగే సభాపక్ష నేతల భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.