న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాల పంపిణీ వేగంగా సాగుతున్నది. 12-14 ఏజ్గ్రూప్లో ఇప్పటి వరకు 50లక్షల మొదటి డోసుల టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం వెల్లడించారు. కొవిడ్ కేసుల తగ్గుదల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ విపత్తు నిర్వహణ చట్టంలోని కొవిడ్ నిబంధనల కట్టడికి తీసుకువచ్చిన నిబంధనలను వెనక్కి తీసుకున్నది. మార్చి నెలాఖరుతో నిబంధనల అమలు పూర్తి కానున్నది. అయితే, మాస్క్ల వినియోగం, రెండు గజాల భౌతిక దూరం నిబంధనలు కొనసాగించాల్సి ఉంటుందని హోంశాఖ పేర్కొన్నది.
మార్చి 24, 2020 రోజున కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కొవిడ్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవల దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం 23,913 యాక్టివ్ కేసులున్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు .28శాతం ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 181.56కోట్ల కొవిడ్ టీకాలను దేశ ప్రజలకు పంపిణీ చేసినట్లు పేర్కొంది. కొవిడ్ కేసుల సంఖ్య పెరిగిన సమయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అవసరమైన మేరకు చర్యలు తీసుకోవచ్చని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు.