న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్తో సతమవుతున్న ఇండియాలో థర్డ్ వేవ్ కూడా తప్పదని ప్రభుత్వంతోపాటు సుప్రీంకోర్టు కూడా తేల్చిసింది. అందుకు సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఫస్ట్ వేవ్ వచ్చి వెళ్లిన తర్వాత అంతా లైట్ తీసుకోవడంతో ఇప్పుడు పెను విషాదాన్నే చూడాల్సి వస్తోంది. మరి రాబోయే ఉపద్రవం నుంచి ఎలా తప్పించుకోవాలి? అసలు ఆ థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది? దాని వల్ల ఎవరికి ఎక్కువ ప్రమాదం? నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.
ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే కరోనా నాలుగో వేవ్ను కూడా చూశాయి. ఇండియా మాత్రం ఇంకా రెండులోనే ఉంది. మూడు తప్పదన్న సంకేతాలు కూడా వచ్చేశాయి. ఆ మూడుతోనే ఇది ముగిసిపోవాలంటే మాత్రం దేశం చేయాల్సిన పని చాలానే ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. ఈ థర్డ్ వేవ్ ఇండియాను వచ్చే చలికాలంలోనే తాకనుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్, ఎపిడమాలజిస్ట్ గిరిధర్ బాబు వెల్లడించారు. నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదటి వారంలో థర్డ్ వేవ్ రావచ్చు. అప్పటిలోపే వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్న వాళ్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి అని ఆయన స్పష్టం చేశారు. ఇక మూడో వేవ్ పిల్లలు, యువతపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు హెచ్చరించారు.
ఈ థర్డ్ వేవ్ ప్రభావం ఎలా ఉంటుందన్నది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంది. ఎంత మందికి వ్యాక్సిన్లు వేశారు? సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లను ఎంతగా ఆపగలిగారు? కొత్త వేరియంట్లను ఎంత త్వరగా గుర్తించారన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుందని గిరిధర్ చెప్పారు.
వ్యాక్సినేషనే దిక్కు
ఈ వేవ్లను అడ్డుకోవడం ఒక్క వ్యాక్సిన్లతోనే సాధ్యమని ఎక్స్పర్ట్స్ ముక్తకంఠంతో చెబుతున్నారు. వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నదని గిరిధర్ బాబు స్పష్టం చేశారు. కేసులు, మరణాల సంఖ్యను తగ్గించడానికి పక్కా ప్రణాళిక అవసరం అని ఆయన చెప్పారు. టెస్టుల సంఖ్యను పెంచి సాధ్యమైనంత త్వరగా వాళ్లను ఐసోలేషన్కు తరలించడం వల్ల వ్యాధి సంక్రమణను అడ్డుకోవచ్చు. జిల్లా స్థాయిలో లేబొరేటరీలను బలోపేతం చేయాలి. అంతేకాకుండా ప్రతి జిల్లా ఆసుపత్రిలో ఒక ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ప్రధాని మోదీ దీనిని ప్రకటించారు అని గిరిధర్ చెప్పారు.
పిల్లలకే ఎక్కువ ప్రమాదం
కరోనా థర్డ్ వేవ్ ఎక్కువగా పిల్లలపైనే ప్రభావం చూపనుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికి ఓ బలమైన కారణమే ఉంది. మూడో వేవ్ వచ్చే నాటికి యువజనుల్లో చాలా వరకూ వ్యాక్సిన్లు తీసుకొని ఉంటారు. కానీ పిల్లలకు మాత్రం వ్యాక్సిన్లు వేసే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. అమెరికాలో ఫైజర్లాంటి కంపెనీలు పిల్లలకు వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నా ఇండియాలో ఇప్పుడప్పుడే ప్రారంభమయ్యేలా లేదు. దీంతో థర్డ్ వేవ్లో ఎక్కువగా పిల్లలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.