తిరుపతి : తిరుమల వేద పాఠశాలలో 57 మంది విద్యార్థులు కరోనా బారిన పడటం స్థానికంగా కలకలం రేపింది. ఐదు రోజుల క్రితం ధర్మగిరి వేద పాఠశాలలో మొత్తం 435 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. వీరందరూ తమ స్వస్థలాల్లో కొవిడ్ ఆర్టిపిసిఆర్ పరీక్షలు చేయించుకుని నెగెటివ్ రిపోర్టు సమర్పించారు. అయితే, మార్చి 9న విద్యార్థులందరికీ మరొకమారు కరోనా ర్యాపిడ్ పరీక్ష నిర్వహించగా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోయినా 57 మంది విద్యార్థులకు పాటిజివ్ రిపోర్టు వచ్చింది.
అధికారులు వెంటనే స్పందించి మెరుగైన వైద్య చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్ దవాఖానకు తరలించారు.మళ్లీ వారికి ఆర్టిపిసిఆర్ పరీక్ష చేయించారు. ఫలితాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం వారికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవు. వారు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. త్వరలోనే వారిని డిశ్చార్జి చేయనున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది.
ఈ నేపథ్యంలో మిగిలిన 378 మంది విద్యార్థులకు, 35 మంది అధ్యాపకులకు, 10 మంది ఇతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది.