ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా కరోనా మహమ్మారిని 2022 సంవత్సరంలో అంతం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ టెడ్రోస్ అధనమ్ ఘెబ్రేసస్ అన్నారు. ఇందుకోసం అందరూ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
జెనీవాలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో టెడ్రోస్ మాట్లాడుతూ.. “ఒమిక్రాన్ లాంటి కొత్త కొ్త్త వేరియంట్ల రూపంలో కరోనా మహమ్మారి ప్రపంచంలో కలకలం సృష్టిస్తున్న సమయంలో పండగల వేళ ఆంక్షలు తప్పనిసరిగా విధించాలి. ప్రస్తుతం ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ మిగతా వేరియంట్ల కన్నా చాలా వేగంగా వ్యాపిస్తోంది.. అందువల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నాపండగలు చేసుకోకపోవడం మంచిది . అలాగే చాలా దేశాలలో ఇప్పటికే జనం మొదటి డోస్ కోసం ఎదురుచూస్తున్నారు.. మరోవైపు ధనిక దేశాలు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటున్నాయి.. ఈ పరిస్థితి మారాలి. ప్రపంచమంతా సమాంతరంగా వ్యాక్సినేషన్ జరిగితే మంచిది” అని అన్నారు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా, అమెరికా, యూరప్ లాంటి దేశాలలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండగా.. క్రిస్మస్ పండుగల కోసం అక్కడ జనం సమూహాలుగా ఏర్పడితే వైరస్ ఇంకా ప్రబలే అవకాశం ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కీలకంగా మారాయి.