హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 60,527 నమూనాలను పరీక్షించారు. ఇందులో 247 మందికి పాజిటివ్గా తేలినట్టు బుధవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా మంచిర్యాలలో 45, మేడ్చల్ మల్కాజిగిరిలో 41, కామారెడ్డి 35, జీహెచ్ఎంసీలో 29, రంగారెడ్డిలో 10 చొప్పున కేసులు వెలుగుచూశాయి. జీహెచ్ఎంసీతో పోల్చితే కామారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
కరీంనగర్ జిల్లా వీణవంక పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గాదర్ల యాదగిరి (56) కరోనాతో ప్రాణాలుకోల్పోయారు. ఏఎస్ఐ మృతిపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కామారెడ్డిలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న పిల్లల వైద్యుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆయన తండ్రికి కూడా పాజిటివ్గా తేలింది. వారం రోజుల క్రితమే వైద్యుడు టీకా రెండోడోస్ వేసుకున్నారు. రెండోడోస్ వేసుకున్న 28 రోజులకు యాంటీబాడీస్ తయారవుతాయి.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నది. మంగళవారం మొత్తం 26,433 మందికి టీకాలు వేసినట్టు బుధవారం విడుదల చేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 8.17 లక్షలకు చేరినట్టు వివరించింది.
సింగరేణివ్యాప్తంగా కార్మికులు, వారి కుటుంబసభ్యులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. వైద్యారోగ్య డైరెక్టర్ సూచనల మేరకు సింగరేణిలోని అన్ని ఏరియాల దవాఖానలు, డిస్పెన్సరీల్లో టీకా ఇవ్వడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు సీఎండీ శ్రీధర్ తెలిపారు. 45 ఏండ్లు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్కు ఆధార్ కార్డుతోపాటు కంపెనీ గుర్తింపుకార్డు కూడా తీసుకురావాలి.
వివరాలు | మంగళవారం | మొత్తం |
పాజిటివ్ కేసులు | 247 | 3,01,769 |
డిశ్చార్జి అయినవారు | 158 | 2,98,009 |
మరణాలు | 3 | 1,659 |
చికిత్స పొందుతున్నవారు | – | 2,101 |