న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో క్షయ (టీబీ) కేసులు పెరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక ప్రకటన చేసింది. మహమ్మారి బారినపడి కోలుకున్న వారంతా తప్పనిసరిగా టీబీ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని ఆరోగ్యమంత్రిత్వ శాఖ సూచించింది. ఇదే సమయంలో టీబీ వ్యాధిగ్రస్థులు సైతం కరోనా పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చెప్పింది. ఈ విషయంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దృష్టి పెట్టాలని చెప్పింది. అయితే, కరోనా నుంచి కోలుకున్న రోగులు క్షయవ్యాధి (టీబీ) బారినపడుతున్నారన్న వార్తలను కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది.
టీబీ కేసుల పెరుగుదలకు.. కరోనా కారణం అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. టీబీ కేసుల పెరుగుదలపై అపోహలను కొట్టిపడేసిన మంత్రిత్వశాఖ.. కొవిడ్-19తో క్షయ, బ్లాక్ ఫంగస్ అభివృద్ధి చెందేలా చేయగలదని, ఇది అవకాశం మాత్రమేనని తెలిపింది. రెండు అంటువ్యాధులు ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తాయని.. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను సృష్టిస్తాయని పేర్కొంది. టీబీ, బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులు బలహీనంగా ఉన్నవారిపై దాడి చేస్తాయని, ఈ మేరకు కరోనా నుంచి కోలుకున్న వారు తమ ఇమ్యూనిటీని పెంచుకోవాలని సూచించింది.