ఇదీ.. కరోనా దృష్ట్యా వాహన కొనుగోలుదారుల అభిప్రాయం
మొబిలిటి ఔట్లుక్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 31: కరోనా వైరస్ తదనంతర పరిస్థితులు వాహన విక్రయాలను దెబ్బతీస్తున్నాయి. మెజారిటీ కొనుగోలుదారులు తర్వాత కొందాంలే అనుకుంటున్నారు మరి. మొబిలిటి ఔట్లుక్ సర్వేలో కార్లను కొందామనుకున్న 80 శాతం మంది, ద్విచక్ర వాహనాలను కొనాలనుకున్న 82 శాతం మంది తమతమ నిర్ణయాలను వాయిదా వేసుకున్నట్టు తేలింది. కొవిడ్-19 ప్రభావం నేపథ్యంలో కస్టమర్లలో వచ్చిన ఈ మార్పు నిరుడుతో చూస్తే ఈ ఏడాది పెరిగే సంకేతాలే ఉన్నట్టు వివరించింది. ఈ క్రమంలోనే ఈ మార్పు పోవడానికి మరికొంత సమయం పట్టవచ్చని ఈ సందర్భంగా కార్ట్రేడ్ టెక్ బ్రాండైన మొబిలిటి ఔట్లుక్ అభిప్రాయపడింది.
పొదుపు దిశగా..
ఇక వాహనాన్ని కొనడానికి బదులుగా ఆ సొమ్మును దాచుకోవడమో లేక ఇతర వ్యక్తిగత సేవింగ్స్లో మదుపు చేసేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నట్టు మొబిలిటి ఔట్లుక్ తెలియజేసింది. అందుకే నిరుడు 14 శాతంగా ఉన్న ఈ తరహా అభిప్రాయంగలవారి సంఖ్య.. ఈ ఏడాది సర్వేలో 18 శాతానికి పెరిగినట్టు చెప్పింది. ఈ నెల 3-12 మధ్య ఇండియన్ ఆటోమోటివ్ కన్జ్యూమర్ క్యాన్వాస్ ఆధ్వర్యంలో ఈ సర్వేను చేపట్టారు. ప్రీ-వోన్డ్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నవారి సంఖ్య కూడా నిరుడుతో పోల్చితే 14 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. అలాగే ఆన్లైన్లో వాహనాలను కొనాలనుకునేవారు కూడా 49 శాతంగా ఉన్నట్టు తాజా సర్వేలో తేలింది.
ఈవీలకు ఆదరణ
ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)కు ఆదరణ పెరుగుతున్నట్టు సర్వే గుర్తించింది. ముఖ్యంగా నిరుడుతో చూస్తే ఈసారి టూవీలర్ ఈవీలను కొనాలనుకుంటున్నవారు 40 శాతానికి పెరిగారు. 2021లో 37 శాతంగానే ఉన్నారు. అయితే ఎలక్ట్రిక్ కార్లను కొనాలనుకునేవారు స్థిరంగా 33 శాతంగానే ఉన్నారు. అయినప్పటికీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఇది అద్దం పడుతున్నది. ఇప్పటికే భారంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇటీవల ముగిసిన ఆయా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే చమురు మార్కెటింగ్ సంస్థలు రోజుకింత పెట్రో ధరల్ని పెంచుతూ పోతున్నాయి. ఫలితంగానే ఈవీలకు ఆదరణ అంతకంతకూ పెరిగిపోతున్నదని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ వస్తుండటం, వాహన కాలుష్యం లేకపోవడం, ప్రభుత్వాలు ప్రోత్సాహకాలనూ ఇస్తుండటం ఈవీ కొనుగోళ్లకు కలిసొస్తున్నదని వారు అభిప్రాయపడుతున్నారు.
‘ప్రజలు కొత్త వాహనాలను కొనేందుకు ఇప్పటికీ సుముఖంగానే ఉన్నారు. అయితే వివిధ కారణాల వల్ల తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. కాబట్టి ఆర్థిక పరిస్థితులు మెరుగైతే విక్రయాలు పెరుగుతాయి. ఇక చార్జింగ్ సదుపాయాలు పెరిగితే ఈవీల అమ్మకాలు మరింతగా పెరగడానికి అవకాశం ఉన్నది’
–భన్వరీలాల్ శర్మ, కార్ట్రేడ్ టెక్ కన్జ్యూమర్ వ్యాపార సీఈవో