న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గిందని కేంద్రం గురువారం తెలిపింది. కొవిడ్ కేసుల వారం సగటు 11వేలు మాత్రమే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక రాష్ట్రంలోనే 10వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయని.. రెండు రాష్ట్రాల్లోనే 5-10వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయని, మొత్తం యాక్టివ్ కేసుల్లో 50శాతం కేరళ, మహారాష్ట్ర, మిజోరాంలోనే ఉన్నాయన్నారు.
ప్రపంచవాప్యతంగా కొన్ని దేశాల్లో కొవిడ్ కేసులు ఇంకా భారీగానే నమోదవుతున్నాయని, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రోజుకు 15లక్షల కేసులు రికార్డవుతున్నాయని చెప్పారు. ప్రపంచంతో పోలిస్తే భారత్లో కేవలం 0.7శాతం మాత్రమే రోజువారీ కేసులు నమోదువుతున్నాయన్నారు. మరణాల నివారణలో వ్యాక్సినేషన్ ప్రభావం ఎంతో ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ అన్నారు. వందలాది మందిని రక్షించడంలో వ్యాక్సిన్లు విస్తృతమైన వ్యాక్సినేషన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయని స్పష్టమవుతోందని నీతి ఆయోగ్ మెంబర్ (హెల్త్) డాక్టర్ వీకే పాల్
పేర్కొన్నారు.