న్యూఢిల్లీ: రెండో కరోనా ఉత్పాతంతో తల్లడిల్లుతున్న భారత్కు పిడుగులాంటి వార్త ఇది. ప్రస్తుతం వైరస్ విజృంభణ చూస్తుంటే మూడో కరోనా ఉత్పాతం తప్పదని అనిపిస్తున్నట్టు వైద్య నిపుణులు తెలిపారు. గురువారం 4,12,784 కొత్త కరోనా కేసులతో, 3,980 మరణాలతో ఇండియా ప్రపంచ రికార్డును అధిగమించింది. ఇవి బయటకి వచ్చిన లెక్కలు. లెక్కకురాని కేసులు ఇంకా ఎక్కువే ఉండవచ్చని అంటున్నారు. మూడో ఉత్పాతం తప్పదని హెచ్చరించిన కేంద్రప్రభుత్వ శాస్త్ర వ్యవహారాల సలహాదారు కే విజయరాఘవన్ అది ఎప్పుడు ఎలా వస్తుందనే విషయాలు మాత్రం దాటవేశారు. ప్రభుత్వం రెండో కల్లోలం తీవ్రతను ఊహించలేకపోయిందని ఆయన అంగీకరించారు. గతవారం ప్రపంచంలోని కొత్త కరోనా కేసుల్లో 46 శాతం ఇండియాలోనే బయటపడ్డాయి. ప్రస్తుతం ఇండియాలో విజృంభిస్తున్న వైరస్ రకం వేగంగా విస్తరించే గుణం కలిగి ఉన్నదని భావిస్తున్నారు. దీనిని ఇండియన్ రకంగా అభివర్ణిస్తున్నారు. ఇది ప్రస్తుతం 17 దేశాల్లో కనిపిస్తున్నది. మొదటి కల్లోలం ముగిసేనాటికి మురాద్ బానాజీ అనే గణిత శాస్త్రవేత్త లాక్డౌన్స్, నియంత్రణలు ఎత్తివేస్తే రెండో కల్లోలం వస్తుందని హెచ్చరించారు. రెండో కల్లోలం ఆయన అంచనాలను కూడా మించిపోవడం గమనార్హం. ఇప్పుడు మూడో కల్లోలం గురించి వినవస్తున్నది. దాని తీరుతెన్నులు ఎలా ఉంటాయో ఇంకా ఎవరూ ఊహించలేకపోతున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోక తప్పదనే మాట ముక్తకంఠంతో వినిపిస్తున్నది.