ముంబై: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ప్రభుత్వ హాస్టళ్లోని అభాగ్యులైన బాలికలను నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ కొందరు కామాంధులు ఒత్తిడి చేశారు. వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే స్థానికంగా ఉండే మరికొందరితో కలిసి ఈ దుర్మార్గానికి ఒడిగట్టడం దారుణం. జల్గావ్ జిల్లాలోని ఆశాదీప్ ఉమెన్స్ హాస్టల్లో ఈ ఘోరం జరిగింది. ఛిఖ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే స్వేత మహాలే అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తడంతో వెలుగులోకి వచ్చింది.
కాగా, జల్గావ్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఈ ఘటనపై మంగళవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అభాగ్యులైన బాలికలను బట్టలిప్పమని ఒత్తిడి చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే శ్వేత మహాలే మండిపడ్డారు. ఆ హాస్టల్లో ఇంకా చాలా మంది మహిళలపై ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని, ప్రభుత్వం సమగ్ర విచారణ చేయించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
దాంతో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఘటనపై విచారణకు నలుగురు సభ్యులతో కమిటీ వేశామని, ఆ కమిటీ రెండు రోజుల్లో విచారణ చేసి నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు. కాగా, ఘటన జరిగిన హాస్టల్ మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఆభాగ్యులైనవారు, ఆనాథలు అయిన బాలికలు, మహిళలకు ఈ హాస్టల్లో వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.