దేశంలో ప్రజలు టీ ఎక్కువ తాగేస్తున్నారని, ఇక నుంచి ప్రతిరోజూ 1-2 కప్పులు తక్కువ టీ తాగాలని ప్రభుత్వం సూచించింది. ఇది జరిగింది ఎక్కడో కాదు. మన దాయాది దేశం పాకిస్తాన్లోనే. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే పాక్ కూడా మరో శ్రీలంక అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రణాళికా విభాగం మంత్రి అహసన్ ఇక్బాల్ తాజాగా ఒక ప్రకటన చేశారు. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ ప్రజలు సుమారు రూ.83.88 బిలియన్ రూపాయల విలువ చేసే టీ తాగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. అంతకుముందు ఏడాది, అంటే 2020-2021లో ఇది రూ.70.82 బిలియన్లుగా ఉండేది. ఇలా టీ వినియోగం పెరగడాన్ని ప్రస్తావించిన ఇక్బాల్..
‘‘దేశం అంతా తాగే టీని 1-2 కప్పులు తగ్గించుకోవాలని అడుగుతున్నా. ఎందుకంటే మనం తాగే టీని అప్పు మీద దిగుమతి చేసుకుంటున్నాం’’ అని తెలిపారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉన్న పాక్పై మరింత భారం పెరగకుండా ఉండాలన్నా, తమ దేశం మరో శ్రీలంక కాకూడదన్నా కఠిన నిర్ణయాలు తప్పవని ఇటీవలే కొందరు నిపుణులు హెచ్చరికలు చేశారు.
ఈ క్రమంలోనే దేశంలోని దుకాణ దారులు కూడా రాత్రి 8.30లోపు షాపులు మూసేయాలని, ఇలా చేస్తే చాలా విద్యుత్ శక్తి ఆదా అవుతుందని పాక్ ప్రభుత్వం ఇటీవలే కోరింది. ఇప్పుడు టీ కూడా తగ్గించుకోవాలని అనడంతో నెటిజన్లు మండి పడుతున్నారు.
‘‘నిజంగానే ఈ మాట అడుగుతున్నారా? మేం అంత వెర్రివాళ్లమని అనుకుంటున్నారా?’’ అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. ‘‘మేం ఇలాంటి పనులు చెయ్యలేం’’ అని మరికొందరు కరాఖండీగా చెప్పేస్తున్నారు.