నెక్నాంపూర్లో కాంగ్రెస్ కౌన్సిలర్ దాష్టీకం
టీఆర్ఎస్ ఆందోళన.. కౌన్సిలర్, బిల్డర్పై కేసు
మణికొండ, మార్చి 6: పురాతన ఆలయాన్ని పూడ్చి.. మరుగుదొడ్ల నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ను నార్సింగి పోలీసులు శనివారం అరెస్టుచేశారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్లో శివుడు, అమ్మవారి ఆలయం ఉన్నది. కొన్నాళ్లక్రితం ఆలయం పక్కనే బిల్డర్ సురేశ్ భవన నిర్మాణం చేపట్టాడు. ఆలయస్థలాన్ని ఆక్రమించుకొనేందుకు స్థానిక కౌన్సిలర్ పద్మారావుతో కలిసి పథకం వేశాడు. అనుకున్నదే తడువుగా ముందుగా ఆలయం పక్కన ప్రహారీ నిర్మించి ఆ తర్వాత ఆలయంలోని విగ్రహాలను తొలగించి.. మరుగుదొడ్లను నిర్మించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులతో పాటు స్థానికులు శనివారం ఆందోళన చేపట్టారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో కౌన్సిలర్ పద్మారావు, బిల్డర్ సురేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆలయాన్ని పునఃనిర్మించేందుకే కూల్చివేశానే తప్ప అవమానపర్చాలని కాదని కౌన్సిలర్ పద్మారావు వివరణ ఇచ్చారు.