ఆత్మకూరు: ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. సోమవా రం రాత్రి వరకు 5 గేట్లెత్తి నీటిని విడుదల చేయగా మంగళవారం తెల్లవారుజామున గేట్లను మూసేశారు. ఉదయం నుంచి 65 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగినప్పటికీ సాయం త్రానికి గేట్లన్నీ మూసివేశారు.
సాయంత్రం 6 గంటల తరువాత 55వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవ్వగా 5 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎడమ కాలువకు 975 క్యూసెక్కులు, కుడి కాలువకు 672, సమాంతర కాలువకు 850, భీమా -2కు 750, నెట్టెం పాడుకు 750 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
విద్యుతుత్పత్తికి 35,922 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా విద్యుత్ ప్రాజక్టుల్లో నిర్విరామంగా విద్యుతుత్పత్తి కొనసాగు తున్నది. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 3.78 మి.యూ ఉత్పత్తి జరుగగా ఇప్పటివరకు ప్రాజెక్టులో 217.021 మి.యూ ఉత్పత్తి జరిగింది.
దిగువ జూరాల విద్యుత్ కేంద్రంలో 4.532 మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 241.40 మి.యూ విద్యుతుత్పత్తి జరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా మంగళవారం సాయంత్రం 8.571 టీఎంసీలు నమోదయ్యింది. ప్రాజెక్టు నుంచి 59.533 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నది.