అడ్డగుట్ట, సెప్టెంబర్ 28 : మహిళ దృష్టిమరల్చి ఏటీఎంలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి నగదు చోరీ చేసిన సంఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మల్కాజిగిరి నివాసి పుష్పలత ఈ నెల 25న ఈస్ట్ మారేడుపల్లి సెయింట్ జాన్స్ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లింది. పలుమార్లు ప్రయత్నించగా ఏటీఎంలో నుంచి డబ్బులు రాకపోవడంతో పక్కనే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు.
ఏటీఎంలో నుంచి తాను డబ్బు తీసి ఇస్తానని చెప్పి.. సదరు మహిళ ఏటీఎం కార్డు తీసుకొని ఆమె దృష్టి మరల్చి తన ఏటీఎంను ఆమెకు ఇచ్చాడు. డబ్బులు రావడం లేదని చెప్పడంతో.. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. దుండగుడు ఆమె ఏటీఎం కార్డు ద్వారా బ్యాంకులో నుంచి రూ.28,670లు డ్రా చేసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. తన ఖాతాలో నుంచి డబ్బులు డ్రా అయ్యాయని ఆలస్యంగా తెలుసుకున్న పుష్పలత బుధవారం తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు.