న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి(Congress presidential elections) కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ ఓటేశారు. ఇక పోటీలో నిలిచిన మల్లిఖార్జున్ ఖర్గే బెంగుళూరులో ఓటేశారు. అధ్యక్ష బరిలో ఖర్గే, శశి థరూర్ మధ్య ప్రధాన పోటీ ఉండనున్నది. వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ కార్యాలయాల్లోనూ ఓటింగ్ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీకి ఇది చరిత్రాత్మక దినమని కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలిపారు. కర్నాటకలో మొత్తం 490 మంది ఓటు వేస్తున్నట్లు ఆయన చెప్పారు. చాలా పారదర్శకంగా ఎన్నికలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా స్పందించారు. ఇది చరిత్రాత్మక రోజు అని, 22 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల ద్వారా పార్టీలో అంతర్గత విబేధాలు లేవని స్పష్టం అవుతోందన్నారు. ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గాంధీ కుటుంబంతో తన అనుబంధం యధావిధిగా కొనసాగుతుందన్నారు.
అక్టోబర్ 19వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు.