న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి (Sonia Gandhi) కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉన్నారు. బుధవారం సాయంత్రం ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని పార్టీ అధికార ప్రతినిధి రన్దీప్ సుర్జేవాలా చెప్పారు. సోనియాకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు హాజరవ్వాల్సి ఉండగా ఆమె కరోనా బారిన పడటం గమనార్హం.
సోనియా గాంధీ.. గత కొన్నివారాలుగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఈ క్రమంలో ఆమె జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని సుర్జేవాలా చెప్పారు. పరీక్షలు చేయించగా పాజిటివ్గా తేలిందన్నారు. వైద్యుల సూచనమేరకు ప్రస్తుతం ఆమె స్వీయ నిర్భందంలో ఉన్నారని వెల్లడించారు.
మనీల్యాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ గురువారం, సోనియా గాంధీ ఈ నెల 8న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే తాను విదేశాల్లో ఉన్న నేపథ్యంలో వ్యక్తిగత హాజరును 5వ తేదీ తర్వాతకు మార్చాలని రాహుల్ గాంధీ ఈడీకి లేఖ రాశారని పార్టీ నేతలు వెల్లడించారు.